పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

కారేపల్లి, వెలుగు: పంట పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఖమ్మం జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా  కారేపల్లి మండలంలోని గేటురేలకాయలపల్లికి చెందిన వాంకుడోత్​ పుల్లు(58) వ్యవసాయం చేస్తున్నాడు. తన మూడున్నర ఎకరాలతో పాటు మరో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. తన సొంత భూమిలో మిర్చి సాగు చేసి, కౌలుకు తీసుకున్న జాగలో పత్తి పెట్టాడు. అధిక వర్షాలకు పత్తి దెబ్బతినగా మిర్చితోటకు వైరస్​ సోకింది. పెట్టుబడులకు నిరుడు తీసుకున్న అప్పు తీరకపోగా, ఈసారి కూడా పెట్టుబడికి అప్పయింది. రెండేండ్లలో అసలే రూ.5 లక్షలు దాటింది. దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారం రోజులుగా అప్పు ఎలా తీర్చాలనే విషయంపై దిగులుగా ఉంటున్నాడు.  సోమవారం ఉదయం చేనుకాడికి వెళ్లొస్తానని చెప్పి మిర్చితోట కెళ్లి పురుగు మందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న పుల్లును పక్క రైతులు కుటుంబీకులకు సమాచారమిచ్చారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు.