భద్రాచలం, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ గ్రామానికి చెందిన బి.మోతీకుమార్ సముద్రమట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపు వరకు వెళ్లి, అక్కడ ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించారు. త్వరలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించబోతున్న మోతీకుమార్ అక్కడి నుంచి వీడియో మెసేజ్ పంపించాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ‘సార్, గిరిజనుల సంక్షేమం కోసం మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలంగా, మీపై ఉన్న అభిమానంతో ఈ ఫ్లెక్సీని తీసుకుని వచ్చాను. ధన్యవాదాలు’ అని ఆ యువకుడు సందేశం పంపించాడు. మోతీకుమార్ గతంలో 5,895 మీటర్లు ఎత్తు ఉన్న మౌంట్కిలీ మంజరో పర్వతం , 5,642 మీటర్ల మౌంట్ ఎలబ్రస్ పర్వతం అధిరోహించాడు.
మౌంట్ కోసియాస్కో అధిరోహించిన తండ్రీకొడుకులు
పెద్దపల్లి: ఆస్ట్రేలియా దేశానికి చెందిన మౌంట్ కోసియాస్కోను పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాలనీకి చెందిన తండ్రీకొడుకులు లెంకల మహిపాల్రెడ్డి, లెంకల వివేకానందరెడ్డి(15) అధిరోహించారు. ఏప్రిల్ 30న పర్వతారోహణ మొదలు పెట్టిన వీరు శనివారం పూర్తి చేశారు. శిఖరాన్నిచేరిన తండ్రీకొడుకులు ‘ఏస్ ఫర్ లైఫ్, సే నో టు డ్రగ్స్’ అనే సందేశాన్ని ఇచ్చారు. గతంలో వీరిద్దరూ యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ను విజయవంతంగా అధిరోహించారు.
