పెద్దన్న అన్నంత మాత్రాన ఒక్కటైనట్టా? : కిషన్ రెడ్డి

పెద్దన్న అన్నంత మాత్రాన ఒక్కటైనట్టా? : కిషన్ రెడ్డి
  • కాంగ్రెస్ గ్యారెంటీలు పేపర్ కే పరిమితం
  • వాటిని ఎలా అమలు చేస్తారో క్లారిటీ లేదు
  • బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని సంబోధించినంత మాత్రాన ఒక్కటైనట్టేనా..? అని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అలా ఆయన ఎందుకన్నారో రేవంత్ రెడ్డినే అడగాలని మీడియాకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేయాలన్నదానిపై క్లారిటీ లేదన్నారు. అవన్నీ పేపర్ కే పరిమితమయ్యాయని విమర్శించారు. 

వాటిపై ప్రచారం మాత్రం జోరుగా చేస్తున్నారని అన్నారు.  పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మన మోదీ డిజిటల్ క్యాంపెయిన్  నిర్వహిస్తామని, పదేండ్లలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.  ప్రశ్నించే తెలంగాణ పేరుతో క్యాంపెయిన్ చేయనున్నామని చెప్పారు. బీజేపీ మ్యానిఫెస్టో  కోసం  రేపటి నుంచి సలహాలు స్వీకరిస్తామని వివరించారు. రాష్ట్రంలో మోదీ సభకు గ్రాండ్ సక్సెస్ అయ్యాయని అన్నారు.  ఈ దేశంలో కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కావని కిషన్ రెడ్డి  కుండ బద్దలు కొట్టారు.