సహకార రంగంలోని సమస్యలు పరిష్కరించండి : కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

సహకార రంగంలోని సమస్యలు పరిష్కరించండి : కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
  • మంత్రి తుమ్మలకు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: సహకార రంగంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కరించాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వ్యవసాయ, సహకార రంగ సమస్యలపై చర్చించారు. ప్రాథమిక సహకార సంఘాల బలోపేతానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు. అలాగే, మట్టి నమూనా పరీక్ష ఫలితాలను ప్రతి రైతుకు అందజేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 

దీనికి అనుగుణంగా విధివిధానాల రూపకల్పనలో కమిషన్ సలహాలు అందించినట్లు కోదండరెడ్డి తెలిపారు. ‘రైతు ముంగిట శాస్త్రవేత్త’కార్యక్రమం అమలు తీరును సమీక్షించాలని, కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న ‘వికసిత్ కృషి సంకల్ప్’అభియాన్‌‌లో (2025 మే 29 నుంచి 2025 జూన్ 12 వరకు) అగ్రి యూనివర్సిటీ సైంటిస్టులు పాల్గొని సక్సెస్‌‌ చేయాలని కోరారు. సాయిల్ టెస్ట్ త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు మూల విత్తనం సరఫరా చేయడానికి వ్యవసాయ శాఖ సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ విత్తనాలు ఉత్పత్తి చేసే రైతుల పొలాలను నిరంతరం పర్యవేక్షించి, ఉత్పత్తి అయిన విత్తనాలు రైతులకు తిరిగి చేరేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.