V6 News

కావాలనే మంగ్లీని టార్గెట్ చేస్తున్నారు.. త్వరలోనే నిజాలు బయటపడ్తయ్: మంగ్లీ మేనేజర్

కావాలనే మంగ్లీని టార్గెట్ చేస్తున్నారు.. త్వరలోనే నిజాలు బయటపడ్తయ్: మంగ్లీ మేనేజర్

సింగర్  మంగ్లీపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఆమె మేనేజర్ మేఘ్ రాజు తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన..  మంగ్లీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాయని ఆరోపించారు. 

ముఖ్యంగా మధు నాయక్, సుబ్బు, తిరుమలేష్, హిమకాంత్ రెడ్డి లాంటి వ్యక్తులతో పాటు కొన్ని ఛానల్స్ కావాలనే ఆమెపై బురద జల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మంగ్లీని మాత్రమే కాకుండా, ఆమె కుటుంబాన్ని కూడా వివాదాల్లోకి లాగి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు.

మంగ్లీ ఎప్పుడూ బాధితుల పక్షాన నిలబడుతుందని, పలు సందర్భాల్లో వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా మేఘ్ రాజు గుర్తు చేశారు. అసలు మంగ్లీపై ఆరోపణలు చేసిన హిమకాంత్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడని ఆయన నిలదీశారు. మంగ్లీ ఎక్కడా ఎండార్స్‌మెంట్ చేయలేదని, ఆమెపై జరుగుతున్నది కేవలం గ్లోబల్ ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. 

ప్రస్తుతం ఈ కేసులో మంగ్లీ ప్రమేయంపై విచారణ కొనసాగుతోందని.. త్వరలోనే అన్ని నిజనిజాలు బహిర్గతం అవుతాయని మేఘ్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. నిజాన్ని నిర్ధారించుకోకుండా అసత్యపు ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు.