
బెంగళూరు: నాలుగు వరుస పరాజయాల తర్వాత ఐపీఎల్లో కోల్కతా మళ్లీ విజయాన్ని అందుకుంది. జేసన్ రాయ్ (29 బాల్స్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 56), కెప్టెన్ నితీష్ రాణా (21 బాల్స్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 48) దంచికొట్టడంతో.. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో నైట్రైడర్స్ 21 రన్స్ తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 200/5 స్కోరు చేసింది. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 179/8 స్కోరుకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ (37 బాల్స్లో 6 ఫోర్లతో 54) టాప్ స్కోరర్. మహిపాల్ లోమ్రోర్ (34) పోరాడాడు. వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
కోహ్లీ ఒక్కడే..
టార్గెట్ ఛేజింగ్లో కోహ్లీ ఉన్నంతవరకు ఆర్సీబీ ఇన్నింగ్స్ బాగానే ఉంది. కానీ కేకేఆర్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (3/27), సుయాశ్ శర్మ (2/30) మిడిల్ ఓవర్స్లో బెంగళూరును బాగా దెబ్బకొట్టారు. సిక్సర్లతో మెరుపు ఆరంభాన్నిచ్చిన డుప్లెసిస్ (17) మూడో ఓవర్లో ఔట్కాగా, ఐదు, ఆరు ఓవర్లలో వరుసగా షాబాజ్ అహ్మద్ (2), మ్యాక్స్వెల్ (5) పెవిలియన్కు చేరడంతో కష్టాలు మొదలయ్యాయి. ఈ దశలో కోహ్లీతో కలిసి మహిపాల్ లోమ్రోర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి నాలుగో వికెట్కు 55 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అయితే నాలుగు బాల్స్ తేడాలో ఈ ఇద్దరూ ఔట్కావడంతో ఆర్సీబీ మళ్లీ డీలా పడింది. దినేశ్ కార్తీక్ (22), సుయాష్ ప్రభుదేశాయ్ (10) గట్టెక్కించాలని చూసినా కోల్కతా బౌలర్లు ఎక్కడా చాన్స్ ఇవ్వలేదు. చివర్లో హసరంగ (5), డేవిడ్ విల్లే (11 నాటౌట్), విజయ్ (13 నాటౌట్) ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించారు. రసెల్ 2 వికెట్లు తీశాడు.
టాప్ లేపారు..
ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా టాప్ ఆర్డర్ దుమ్మురేపింది. జేసన్ రాయ్ రెండు ఫోర్లతో ఖాతా ఓపెన్ చేయగా, నారాయణ్ జగదీశన్ (27) కూడా ఫర్వాలేదనిపించాడు. థర్డ్ ఓవర్లో రెండు ఫోర్లు, రాయ్ ఓ సిక్స్తో 17 రన్స్ రాబట్టారు. ఆరో ఓవర్లో రాయ్ మూడు సిక్సర్లు కొట్టడంతో పవర్ప్లేలో నైట్రైడర్స్ 66/0 స్కోరు చేసింది. రాయ్ 22 బాల్స్లో ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు. అయితే 10వ ఓవర్లో విజయ్ కుమార్ (2/41) ఈ ఇద్దర్ని ఔట్ చేసి ఆర్సీబీకి ఉపశమనం కలిగించాడు. ఫస్ట్ వికెట్కు 83 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఈ దశలో వెంకటేశ్ అయ్యర్ (31), నితీష్ రాణా భారీ హిట్టింగ్తో రన్రేట్ తగ్గకుండా చూశారు. 16వ ఓవర్లో వెంకటేశ్ ఓ ఫోర్ కొడితే రాణా రెండు సిక్స్లతో 19 రన్స్ రాబట్టారు. తర్వాతి ఓవర్లో రాణా 4, 4, 6తో 17 రన్స్ చేయడంతో కేకేఆర్ స్కోరు 167/2కు పెరిగింది. అయితే 18వ ఓవర్లో మూడు బాల్స్ తేడాలో హసరంగ (2/24).. ఈ ఇద్దర్ని పెవిలియన్కు పంపడంతో స్కోరు 169/4గా మారింది. ఇక్కడి నుంచి రింకూ సింగ్ (18 నాటౌట్) జోరందుకున్నాడు. 19వ ఓవర్లో రింకూ 6, 4, 4 బాదితే, రసెల్ (1) నిరాశపర్చాడు. లాస్ట్ ఓవర్లో డేవిడ్ వీస్ (12 నాటౌట్) రెండు సిక్స్లు కొట్టడంతో స్కోరు 200లకు చేరింది.