
- ఎన్నికల ముందు పీఆర్సీ వేయడం సిగ్గుచేటు : ఎంపీ కోమటిరెడ్డి
- 15 నుంచి 20 శాతం ఐఆర్ ఇవ్వాలని సీఎం కేసీఆర్కు లేఖ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో డ్యూటీలు పక్కనపెట్టి పోరాడిన ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు మొండి చెయ్యి చూపించిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. పదేండ్లలో ఒక్క ఐఆర్(ఇంటీరియం రిలీఫ్) కేవలం 5 శాతం ఇచ్చి ఉద్యోగులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ గడువు మూడు నెలల కిందటే ముగిసినా.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న టైంలో వేయడం సిగ్గుచేటన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి 2004లో 8 శాతం, 2008లో 22 శాతం, కిరణ్ కుమార్ రెడ్డి 27 శాతం చొప్పున ఐఆర్ ప్రకటించారని గుర్తు చేశారు.
కానీ, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం 2018లో ఐఆర్ ఏమీ ఇవ్వకపోగా.. ఇప్పుడు కేవలం 5 శాతం ఇచ్చి అవమానించిందని విమర్శించారు. ఉద్యోగులకు 15 నుంచి 20 శాతం ఐఆర్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన డీఏ విషయంలోనూ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. కేసీఆర్ తీరుపై ఉద్యోగులు ఒకసారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించాలని కోరారు. ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు తిరగబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తర్వాత రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఐఆర్, పీఆర్సీ, డీఏలను ప్రకటించి అందరికీ లాభం చేస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.