భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం  : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నార్కట్​పల్లి,వెలుగు(రామన్నపేట): భువనగిరిలో ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్​చార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, తెలంగాణ శాసన మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేటి విద్యాసాగర్ రావు, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్​అభ్యర్థిని గెలిపించేందుకు కార్యకర్తలు కృషిచేయాలన్నారు. 

పదేండ్లలో కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారు తప్ప.. తెలంగాణలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. పేపర్ లీకేజీలతో విద్యార్థి జీవితాలు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో రామన్నపేట మండలంలో వార్ వన్ సైడ్ గా ఉండాలని, చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రామన్నపేట  ఎంపీపీ పూస బాలమణి, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్ మెహన్, కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి మల్లారెడ్డి,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.