
- ఎన్నికలు రాగానే పర్యటనలు మొదలు పెట్టిండు: మంత్రి వెంకట్రెడ్డి
- సనత్ నగర్ టిమ్స్ అక్టోబర్ 31న ప్రారంభిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలు రాగానే మాజీ మంత్రి హరీశ్ రావు పొలిటికల్ విజిట్స్ చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. సనత్నగర్ టిమ్స్ వెంటనే ప్రారంభించకపోతే పోరాటం చేస్తామన్న హరీశ్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మీది మాటల ప్రభుత్వం అయితే, మాది చేతల ప్రభుత్వమన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలో హాస్పిటల్స్ కడుతున్నామని గొప్పలు చెప్పుకొని, వాటిని శంకుస్థాపన స్థాయిలోనే వదిలేశారన్నారు. మీ ప్రభుత్వం ఇంజినీరింగ్ వర్క్ల విషయంలో రూ.40 వేల కోట్ల బకాయి పెట్టిపోయింది నిజం కాదా ప్రశ్నించారు.
ఆ బిల్లులను తమ ప్రభుత్వం చెల్లిస్తున్నదని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన 21 నెలల్లోనే పలు హాస్పిటల్ బిల్డింగ్స్ నిర్మాణాలను వేగవంతం చేసిందని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యా, వైద్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్ని ఈ నెల 31న ప్రారంభిస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన విషయం హరీశ్ రావుకు గుర్తులేదా అని ప్రశ్నించారు. అలాగే, వరంగల్ హాస్పిటల్ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి, అల్వాల్ హాస్పిటల్ను వచ్చే మార్చి నాటికి ప్రారంభిస్తామన్నారు. రూ.2 వేల కోట్లతో నిర్మిస్తున్న నిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్ను వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, ఎల్బీనగర్ హాస్పిటల్ను వచ్చే జూన్ నాటికి అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
20 వేల కోట్లతో రెసిడెన్షయిల్ స్కూల్ బిల్డింగ్స్..
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో రూ.20 వేల కోట్లతో ఆధునాతన రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం రూ.8 కోట్లతో నిర్మించిన ఎర్రమంజిల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. కార్పొరేట్ హంగులతో నిర్మించిన ఎర్రమంజిల్ స్కూల్.. బెస్ట్ మోడల్ స్కూల్గా నిలుస్తుందని చెప్పారు. త్వరలో ఈ స్కూల్లో డిజిటల్ క్లాస్లతో పాటు ఏసీ రూంలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆఫీసర్లు పాల్గొన్నారు.