లాక్డౌన్ తర్వాత ఉద్యమం చేస్తాం

లాక్డౌన్ తర్వాత ఉద్యమం చేస్తాం

ఓ వైపు కరోనా.. మరోవైపు అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే.. అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆవిర్భావ ఉత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకపోతే లాక్డౌన్ తర్వాత ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

‘IKP,PACS సెంటర్లలో ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ 6 నెలలపాటు కష్టపడి పండించిన పంటను వర్షం పాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలి. వర్షంతో తడిసి ధాన్యాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది. వర్షాల కారణంగా చేతికి వచ్చిన ధాన్యం నీళ్ల పాలు అవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తోంది. IKP,PACS సెంటర్లలో రైతులు 15 రోజులుగా పడిగాపులు కాస్తున్న పట్టించుకునే నాధుడే లేడు. ప్రభుత్వం చేతకాని తనం వల్లనే రైతులకు ఈ కష్టాలు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతులకు నష్టం వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ధాన్యం ఎలా ఉన్నా కొనుగోలు చేయాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చండూరు, నాంపల్లి, పోచంపల్లి, చింతపల్లి మొదలైన మండలాల్లో ఐకేపీ సెంటర్లలో పోసిన ధాన్యం తడిసిపోయింది. రైతులను ఇబ్బంది పెట్టకుండా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.

అధికార పార్టీ MLAలు కాన్వాయిలతో ప్రచారం చేసుకోవడం తప్ప రైతులకు చేసిన మేలు ఏం లేదు. టీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేసుకునే గుణం తప్ప సేవ చేసే తత్వం లేదు. ప్రజల కష్టాలను గాలికి వదిలేసి సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉంది. జెండాలు ఎగరేసి సంబరాలు జరుపుకునే సమయం ఇది కాదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వారం రోజుల్లో రైతులకు న్యాయం జరగకపోతే IKP,PACS కేంద్రాల వద్ద ధర్నా చేస్తాం. బత్తాయి కేంద్రాలను ప్రారంభించారు కానీ.. ఒక్క రైతు దగ్గర కూడా బత్తాయిలను కొనుగోలు చేయలేదు. లాక్డౌన్ వల్ల పాడైపోతున్న బత్తాయి, నిమ్మ, మామిడి పండ్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి పేదవాళ్లకు పంచాలి. లాక్ డౌన్ కారణంగా ఎగుమతులు నిలిచిపోయి పండ్లను ఎవరూ కొనుగోలు చేయడంలేదు. కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 400 కోట్ల రూపాయల విలువ చేసే మామిడి, నిమ్మ, బత్తాయి పంట ఉంటుంది. ప్రభుత్వం ఈ పంటను కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించాలి. తక్షణం రైతులను ఆదుకోకపోతే మే7న లాక్ డౌన్ ముగిసిన తర్వాత రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఉద్యమం చేస్తాం’ అని కోమటిరెడ్డి అన్నారు.

For More News..

చికిత్స లేకుండానే కరోనాను జయించిన చిన్నారి

లాక్డౌన్ డ్యూటీలో తోటి పోలీసుకు హెయిర్ కట్ చేసిన మరో పోలీస్

రాజ్ భవన్ లో నలుగురికి కరోనా..

మరణశిక్షను రద్దు చేసిన సౌదీ అరేబియా