డెయిరీ ఫామ్ పేరిట భారీ మోసం

డెయిరీ ఫామ్ పేరిట భారీ మోసం
  • న్యాయం చేయాలని బాధితుల డిమాండ్ ​

ఖైరతాబాద్, వెలుగు: మొయినాబాద్​అజీజ్​నగర్​లోని కొండపల్లి డెయిరీ ఫామ్ నిర్వాహకులు తమను మోసం చేశారని బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పెట్టుబడుల పేరుతో దాదాపు 20 మంది నుంచి కోట్లాది రూపాయిలు వసూలు చేశారని ఆరోపించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో బాధితులు ఎస్.మధు, కేవీ. సాంబశివరావు, కె. వెంకటేశ్వరరావు, డి.సురేందర్ కలిసి మాట్లాడారు. భద్రాది కొత్తగూడెంకు చెందిన వేముల సుబ్బారావు దంపతులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​అజీజ్​నగర్​లో కొండపల్లి డెయిరీ ఫామ్​ఏర్పాటు చేస్తున్నట్టు పేపర్​లో ప్రకటన ఇచ్చారన్నారు.

 ప్రకటన చూసి ఆయనను సంప్రదిస్తే ఒక్కో బర్రెకు రూ.1.30 లక్షలు చెల్లించాలని చెప్పారన్నారు. వచ్చిన లాభాల్లో 36 శాతం సభ్యుడికి  ఇస్తానని చెప్పడంతో తామంతా ఎక్కువ శాతం డబ్బులు కట్టామన్నారు. ఒక్కొక్కరు రూ.20 లక్షల నుంచి కోట్లాది రూపాయిలను ఆభరణాలు  తనఖా పెట్టి చెల్లించినట్లు చెప్పారు. మొయినాబాద్​వద్ద ఉన్న ఫామ్​లో దాదాపు 500 బర్రెలు ఉండేవన్నారు. 

రెండు రోజుల క్రితం రాత్రికి రాత్రే వాటిని అక్కడ్నుంచి తరలించుకుపోయారన్నారు. తమను నమ్మించి మోసం చేసిన సుబ్బారావు, అతని భార్య వేముల కుమారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని తమ డబ్బును తిరిగి ఇప్పించాలని కోరారు. దీనిపై మొయినాబాద్​పీఎస్, సైబరాబాద్​ కమిషనర్​కు ఫిర్యాదు చేశామని, సీఎం రేవంత్​ రెడ్డి దీనిపై దృష్టి పెట్టి సమస్యను పరిస్కరించాలని కోరారు.