హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత లేదని.. కేవలం కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీలోనే ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. సోమవారం (జూన్ 22) చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్లో రూ.25 లక్షల CSR నిధులతో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్కు మంత్రి వివేక్ శంకుస్థాపన చేశారు. అలాగే భీమారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ గల్స్ హై స్కూల్లో రూ.66 లక్షల నిధులతో నిర్మించిన అదనపు తరగతుల గదులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడ కూడా రైతులు ఇబ్బందులు పడలేదని.. చివరి గింజ వరకు సక్సెస్ ఫుల్గా ధాన్యం కొనుగోళ్లు చేశామన్నారు. కొంత లారీల కొరత ఉండటంతో మైనింగ్, సింగరేణి లారీలను ఉపయోగించామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకున్న బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఉసిగొల్పిన రైతులు ధర్నాల్లో పాల్గొనలేదని చెప్పారు.
వాన కాలం సీజన్కు సరిపడా యూరియా:
ఈ వానకాలం సీజన్కి రైతులకు సరిపడా యూరియా ఉందని మంత్రి వివేక్ తెలిపారు. యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని.. అవసరం ఉన్నంత వరకే యూరియా వాడాలని సూచించారు. యూరియా యాప్తోనే క్రమపద్దతిలో యూరియా పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ 2026, జూన్ 30న రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తామని రైతులకు శుభవార్త చెప్పారు.
జర్మన్ లాంగ్వేజ్తో విదేశాల్లో ఉద్యోగాలు:
జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి వివేక్ తెలిపారు. ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుందన్నారు. ఫారెన్ లాంగ్వే్జెస్ ట్రైనింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన TOMCOMను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విదేశాల్లో ఉద్యోగాల ద్వారా ఏడాదికి రూ.25 లక్షల వరకు సంపాదించవచ్చని చెప్పారు.
ALSO READ : నెలకు జీతం రూ.3లక్షల 50వేలు..
మందమర్రిలో కొత్త మైన్:
మందమర్రిలో కొత్త మైన్ రాబోతుందని.. దీనికి సంబంధించిన ఫారెస్ట్ క్లియరెన్స్ అతి త్వరలో వస్తుందని మంత్రి వివేక్ తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో మరో 5 వేల ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకుని తల్లి తండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి మొదటి ప్రయార్టీ ఇస్తుందని చెప్పారు. చెన్నూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అందుబాటులోకి వస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
