- మరో ఆఫీసర్ అంజిరెడ్డిపై కొనసాగుతున్న విచారణ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రెండేండ్ల కింద సింగరేణి స్టోర్లో జరిగిన చోరీకి బాధ్యుడిని చేస్తూ సింగరేణి ఇల్లెందు ఏరియాలో ఎస్ఈగా పని చేస్తున్న ఆనందరావును కంపల్సరీ రిటైర్మెంట్ స్కీంలో భాగంగా ఉద్యోగానికి రిజైన్ చేయాలని యాజమాన్యం ఆదేశించింది. ఈ మేరకు యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అంజిరెడ్డిపై విచారణ చేపట్టింది.
రెండేండ్ల కింద స్టోర్లో రూ.8 లక్షల విలువైన కాపర్ చోరీకి గురైనట్లు ఆఫీసర్లు గుర్తించారు. కాగా, రూ. 25 లక్షలకు పైగానే కాపర్ దొంగతనం జరిగిందనే ప్రచారం జరిగింది. చాలా ఎత్తులో ఉండే స్టోర్ పైకప్పు రేకులు తొలిగించి కాపర్ చోరీ చేయడం అప్పట్లో కలకలం రేపింది.
సింగరేణి ఎస్అండ్పీసీ విభాగానికి చెందిన స్పెషల్ టీమ్స్తో పాటు సెక్యూరిటీ పక్కాగా ఉన్న ఈ స్టోర్లో దొంగతనం జరగడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై సింగరేణి విజిలెన్స్ అధికారులతో పాటు యాజమాన్యం విచారణ నిర్వహించి సెక్యూరిటీ విభాగంలో పని చేస్తున్న ముగ్గురు జమేదార్లకు ఇంక్రిమెంట్లను కట్ చేసింది. స్టోర్లో పని చేస్తున్న అప్పటి ఎస్ఈ ఆనందరావును సీఆర్ఎస్లో వెళ్లిపోవాలని ఆదేశించింది. సెక్యూరిటీ ఆఫీసర్ అంజిరెడ్డిపై విచారణ కొనసాగుతోంది.
