ఆళ్లపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం రాఘవపురం గ్రామసభలో ప్రభుత్వ స్కూల్ టీచర్ తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్లో చదివే థర్డ్ క్లాస్ స్టూడెంట్ పాయం శ్రీవల్లిపై దాడి చేశారంటూ గ్రామస్తులు, తల్లిదండ్రులు ఆరోపించారు. టీచర్ స్కూల్కు సరిగా రాకపోవడంతో గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
మనసులో పెట్టుకున్న టీచర్ ‘మీ అమ్మనాన్నలు నాపై ఫిర్యాదు చేస్తారా..?’ అంటూ చిన్నారిని కొట్టినట్లు గ్రామసభలో తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై గ్రామసభలో టీచర్ను నిలదీయగా తాను ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని, చదువు సరిగా రాకపోవడంతో మందలించానని వివరణ ఇచ్చారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు.
