చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా: నిరసనలు ఆపాలన్న KTR

చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా: నిరసనలు ఆపాలన్న KTR

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీఆర్ఎస్ భవన్ లో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. అవసరమైతే పరువునష్టం దావా వేస్తనన్నారు. విద్యార్థులు తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దని కోరారు కేటీఆర్.

టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో నిర్వహించిన మే డే వేడుకల్లో కేటీఆర్ పాల్గొని జెండా ఎగరేశారు. ఆ తర్వాత ప్రసంగించారు. “ప్రతిపక్షాలు ఏ అంశం లేకనే ఇంటర్మీడియట్ సమస్యను రావణ కష్టంలా రగిలిస్తున్నాయి. నేనూ ఓ తండ్రినే .. పిల్లల బాధ నాకు తెలుసు. తల్లిదండ్రులు, పిల్లలు ఆందోళన చెందవద్దని కేసీఆర్ కూడా విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖకు సంబంధించిన అంశాన్ని ఐటీ శాఖకు లింక్ పెడుతున్నారు. ఇంటర్ బోర్డ్ టెండర్ లు ఇచ్చింది. ఐటీ మంత్రిగా ఉంటే నాకు సంబంధమా .?  నేను ఐటీ మంత్రి గా ఉన్నపుడు globerana సంస్థకు టెండర్ దక్కితే తప్పును నాకు అంట గడుతున్నారు.  రూ.4 కోట్ల 30 లక్షల టెండర్ లో రూ. 10వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని కొందరు దిగజారి మాట్లాడుతున్నారు” అన్నారు కేటీఆర్.

“సమస్య సున్నితమైనది కనుక అందరూ సంయమనం పాటించాలి. రాజకీయంగా కేసీఆర్ ను ఎదుర్కోవాలి అంటే ప్రతిపక్షాలకు వేరే అంశాలు ఉన్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు.. తొందర పడవద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఓ బఫూన్ పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు రమ్మంటే వెళ్లాలా? ఒకరిని దొంగ అని ఆరోపించి నిజాయతీని నిరూపించుకొమ్మంటే ఎలా ? హై కోర్టు లో ఇంటర్ కేసు విచారణ జరుగుతోంది. కోర్టు దోషులుగా తేల్చిన వాళ్ళను శిక్షించాలని నేనే ప్రభుత్వాన్ని మొదట డిమాండ్ చేస్తా. ప్రతిపక్ష నేతలు నోటి కొచ్చినట్టు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తాం. మీడియా కూడా ఇంటర్ సమస్య విషయంలో సంయమనం పాటించాలి.  రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుంది. అప్పటి దాకా అందరూ ఓపిక పట్టాలి” అని కోరారు కేటీఆర్.