పేర్లు, చిహ్నాల మార్పుతో ప్రజలకు ఒరిగిందేంటి? : కేటీఆర్

పేర్లు, చిహ్నాల మార్పుతో ప్రజలకు ఒరిగిందేంటి? : కేటీఆర్
  • రేవంత్ ​నిర్ణయంతో సికింద్రాబాద్ గుర్తింపు పోయేలా ఉంది: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజల అస్థిత్వానికి హైదరాబాద్, సికింద్రాబాద్ గొప్ప చిహ్నాలని.. కానీ, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో సికింద్రాబాద్​కు ఉన్న చారిత్రక గుర్తింపు పోయేలా ఉందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్​ను కార్పొరేషన్​చేయాలని డిమాండ్ చేస్తూ​శనివారం బీఆర్ఎస్​ర్యాలీ తలపెట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్​లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘మొదట టీఎస్​ తీసేసి టీజీ అన్నారు. ఆ తర్వాత తెలంగాణ తల్లిని మార్చారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తీసేశారు. అధికార చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణాన్ని, చార్మినార్​ను తీసేశారు. వీటితో ప్రజలకు ఏం లాభం జరిగిందో ప్రభుత్వం చెప్పాలి.

ఇలాంటివి తప్పించి రేవంత్​ రెడ్డి చేసిందేమీ లేదు’’ అని విమర్శించారు. హైదరాబాద్​ సిటీలో రెండేండ్లుగా సీఎం రేవంత్​ రెడ్డి ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్నారు. ఒక్కరోడ్డు, ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని కేటీఆర్​ విమర్శించారు. తియుతంగా ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైన తమను.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారని కేటీఆర్​మండిపడ్డారు. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్​ నాయకులను అరెస్ట్​ చేశారని ఫైర్​అయ్యారు. ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.

పాలమూరు జిల్లాలను రద్దు చేసేందుకు కుట్ర 

పాలమూరు జిల్లా బిడ్డను అని చెప్పుకుంటున్న రేవంత్​ రెడ్డి.. పాలమూరు జిల్లాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. శనివారం ఆయన తన నివాసంలో హరీశ్​రావుతో కలిసి ఉమ్మడి నల్గొండ, మహబూబ్​నగర్​ జిల్లాల అధ్యక్షులు, పార్టీ నేతలతో  సమావేశం నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం, కృష్ణా జలాల వాటా వంటి కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపల్​ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.