జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా.. వందలకొద్దీ కేసులు పెట్టినా నేను భయపడ: కేటీఆర్

జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా.. వందలకొద్దీ కేసులు పెట్టినా నేను భయపడ: కేటీఆర్
  • మహా అయితే 15 రోజులు జైలులో పెడతారేమో 
  • మళ్లీ చెప్తున్నా ఇదో లొట్టపీసు కేసు
  • సీఎం రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ అడిగింది
  • అరెస్ట్​ చేసుకొమ్మని ఏసీబీ అధికారులకు చెప్పిన
  • ఫార్ములా ఈ రేస్​తో తెలంగాణ ప్రతిష్టను పెంచిన
  • జూన్​ 21న కాళేశ్వరం సంబురాలు 
  • నిర్వహించాలని పార్టీ కేడర్​కు పిలుపు

హైదరాబాద్, వెలుగు: తనపై వందలకొద్దీ కేసులు పెట్టినా భయపడనని, జైల్లో పెడితే రెస్ట్​ తీసుకుంటానని బీఆర్ఎస్​ వర్కింగ్​ప్రెసిడెంట్​ కేటీఆర్​అన్నారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ద్వారా తాను తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే పని చేశానే తప్ప.. ఎలాంటి తప్పు, తలదించుకునే పని చేయలేదని పేర్కొన్నారు. నాలుగు గోడల మధ్య కాదు.. నాలుగు కోట్ల మంది ముందు ఫార్ములా ఈ రేసు గురించి అసెంబ్లీలో  చర్చిద్దామంటే రేవంత్ రెడ్డి పారిపోయాడని కేటీఆర్ విమర్శించారు.

ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్‎లో మీడియాతో ఆయన మాట్లాడారు.  మొదటి సంవత్సరం ఫార్ములా ఈ రేసు విజయవంతం కావడంతో రెండో ఏడాది కూడా ఎలాగైనా హైదరాబాద్‎లోనే నిర్వహించాలని తమ ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకున్నదని, అందులో భాగంగానే నిర్వహణ సంస్థ బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపించామని చెప్పారు.  

ఇదే  విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించానని తెలిపారు. ఇందులో అవినీతి ఎక్కడ ఉందని తాను అధికారులను ప్రశ్నిస్తే వారి దగ్గరి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నారు. ‘‘చిట్టినాయుడు (సీఎం రేవంత్) రాసిచ్చిన పనికిమాలిన ప్రశ్నలనే పొద్దుటి నుంచి అటుతిప్పి ఇటు తిప్పి ఏసీబీ అధికారులు అడిగారు.. ఒకవేళ ప్రభుత్వ పెద్దల నుంచి అరెస్ట్ చెయ్యాలని ఒత్తిడి ఉంటే బేషుగ్గా చేసుకోవచ్చని అధికారులకు చెప్పా. అవసరమైతే తెలంగాణ కోసం మరోసారి జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.

 రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడేవారు ఎవరూ బీఆర్ఎస్‎లో లేరు. అక్రమ కేసుల్లో తమకు నోటీసులు రావడం పాత చింతకాయ పచ్చడిలా మారింది. మళ్లీ చెప్తున్నా ఇదో లొట్టపీసు కేసు’’ అని కేటీఆర్​ వ్యాఖ్యానించారు. పెడితే గిడితే తనను ఒక 15 రోజులు  జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందడం తప్ప ఇంకేం చేయలేడని అన్నారు.  

 కాళేశ్వరం సంబురాలు చేయండి..

2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టును  కేసీఆర్ జాతికి అంకితం చేశారని కేటీఆర్​ తెలిపారు.  ఆరేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రాజెక్టు గొప్పదనాన్ని ప్రజలకు తెలియజేసేలా రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు నిర్వహించాలని ఆ పార్టీ కేడర్​కు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిగీసి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఫుట్​బాల్ ఆడాలని.. చిత్తుచిత్తుగా ఓడించడం మీద బీఆర్ఎస్ నాయకులు దృష్టి పెట్టాలని సూచించారు. 

కేసులు, కమిషన్లతో ఇబ్బంది పెడ్తున్నరు 

ఫార్ములా ఈ రేసు కేసులో తనను మూడు సార్లు కాదు 30 సార్లు పిలిచినా వస్తానని కేటీఆర్ అన్నారు.  సోమవారం ఏసీబీ విచారణకు ముందు, తర్వాత తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. హరీశ్ రావుతో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “నన్ను ఏసీబీ విచారణకు మళ్లీ మళ్లీ పిలిచి రాక్షసానందం పొందుతున్నారు. అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు. మాకు జైలు, కేసులు కొత్త కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్లొచ్చా. ఫార్ములా ఈ రేసులో తెలంగాణను ప్రపంచంలో నంబర్​ వన్ చేశాం” అని పేర్కొన్నారు.  

ప్రశ్నిస్తూనే ఉంటం..

తమపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని కేటీఆర్ అన్నారు. కమిషన్లు వేసి తమను ఇబ్బంది పెట్టినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించకుండా ఉండబోమని చెప్పారు. ప్రశ్నించకుండా ఉంటారనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకమన్నారు. “కేసీఆర్, హరీశ్ రావును కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టారు. పైశాచిక ఆనందం పొందారు” అని వ్యాఖ్యానించారు. హామీలను అమలు చేసేవరకు ప్రశ్నిస్తూనే ఉంటామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.  

రేవంత్ తీరును ప్రజలు గమనిస్తున్నరు..

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తున్నదన్న సంకేతాలు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించి.. ఇప్పుడు వాటిని విస్మరించి స్థానిక సంస్థలకు వెళ్తున్నారని ఫైర్​ అయ్యారు. “రాష్ట్ర ప్రజలు, బీసీలు రేవంత్ రెడ్డి తీరును గమనిస్తున్నరు. రైతు బంధును ఎలక్షన్ బందుగా మార్చిన విషయాన్ని రైతులు గమనిస్తున్నరు. నెలకు 2,500 ఎగ్గొట్టిన విషయాన్ని రాష్ట్ర మహిళలు గమనిస్తున్నరు. చెప్పుకోవడానికి సమాధానం లేక రేవంత్​రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్  నడిపిస్తున్నడు. ఏదో ఒక కమిషన్ ఎంక్వైరీ అంటూ కాలయాపన చేస్తున్నరు” అని రేవంత్​ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు.