
- మామూళ్లు మొత్తం మనకే వస్తయ్
కూకట్పల్లి, వెలుగు: ‘అతడో వీధి రౌడీ.. అతడు అడిగితే కిమ్మనకుండా మామూళ్లు ఇస్తారు.. వారి కళ్లముందే ఎన్నో సెటిల్మెంట్లు చేశాడు.. అతడిని చంపేస్తే మనకే ఆ స్థానం వస్తుంది కదా.. బాగా పాపులర్ రౌడీలం కూడా కావచ్చు’.. ఇలా ఆలోచించిన ముగ్గురు యువకులు ఓ రౌడీషీటర్ను హత్య చేశారు. అనుచరులుగా ఉంటూనే నమ్మించి పథకం ప్రకారం మర్డర్ చేశారు. మూడు రోజుల క్రితం కూకట్పల్లిలో జరిగిన మర్డర్ కేసు కథ ఇదీ. ఈ కేసును పోలీసులు చేధించగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. బుధవారం కూకట్పల్లి పోలీసుస్టేషన్లో బాలానగర్ జోన్ డీసీపీ కె.సురేశ్కుమార్ వివరాలు వెల్లడించారు.
బోరబండ పరిధిలోని అల్లాపూర్లో నివసించే సయ్యద్ షాహిద్(22) రౌడీషీటర్. పలువురి వద్ద మామూళ్లు వసూలు చేయడంతో పాటు సెటిల్మెంట్లు చేస్తుంటాడు. తన ఏరియాకు చెందిన సాజిద్, హనూక్ అలియాస్ మున్నా, సమీర్ఖాన్తో కలిసి పలు దందాలు చేశాడు. దీంతో వీరు ఆయనను బాగా గమనించి.. తనలా క్రేజ్ సంపాదించాలని అనుకున్నారు. అతడిని చంపేస్తే తామే పెద్ద రౌడీలుగా చెలామణి అవ్వొచ్చని భావించారు. పథకం ప్రకారం జూన్ 29న రాత్రి కూకట్పల్లిలో తమ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని నమ్మించి షాహిద్ని పిలిపించారు. నిర్జన ప్రదేశంలో మద్యం తాగించి బీరు బాటిళ్లతో దాడి చేశారు. ఆ తర్వాత బండరాయి తలపై వేసి హత్య చేశారు. ముగ్గురు నిందితులని పోలీసులు రిమాండ్కు తరలించారు.