
మకావు: ఇండియా షట్లర్లు లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి, మన్నేపల్లి తరుణ్ మకావు ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేయగా.. సీనియర్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టాడు. కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ లక్ష్యసేన్ బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ మొదటి రౌండ్లో 21–-8, 21–-14తో కొరియాకు చెందిన జియోన్ హ్యోక్ జిన్ను ఓడించి ముందంజ వేశాడు. ఇతర మ్యాచ్ల్లో 31వ ర్యాంకర్ ఆయుష్ శెట్టి 21-–10, 21–-11తో హువాంగ్ యు కై (చైనీస్ తైపీ)పై, తరుణ్ 21–-19, 21–-13తో తోటి షట్లర్ మన్రాజ్ సింగ్పై గెలిచారు.
కానీ, స్టార్ షట్లర్ ప్రణయ్ 21–-18, 15–-21, 15–-21తో సాట్ మార్సెల్లినో (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడాడు. సతీష్ కుమార్ 19-–21, 12–-21తో జస్టిన్ హో చేతి (మలేసియా) చేతిలో ఓడి నిష్క్రమించాడు. మిక్స్డ్ డబుల్స్లో ఐదో సీడ్గా బరిలోకి దిగిన ధ్రువ్ కపిల– తనిషా క్రాస్టో 21–-10, 21–-15తో థాయ్లాండ్ జోడీ రచపోల్ మకాససిథార్న్– నటామోన్ లైసువాన్ను చిత్తు చేశారు. మెన్స్ డబుల్స్లో కృష్ణమూర్తి రాయ్–ఎస్. ప్రతీక్ 21–-18, 21–-19 ఇండియాకే చెందిన కొంతుజమ్–అమాన్ మహ్మద్ను ఓడించారు. విమెన్స్ సింగిల్స్లో రక్షిత రామ్ రాజ్ మాత్రమే ముందంజ వేసింది.
తొలి రౌండ్లో తను 18–21, 21–17, 22–20తో పోర్న్పిచా చొయికీవాంగ్ (థాయ్లాండ్)ను ఓడించింది. గత వారం చైనా ఓపెన్లో పీవీ సింధుపై గెలిచి సంచలనం సృష్టించిన ఉన్నతి హుడా 21–-16, 19–-21, 17–-21తో డెన్మార్క్ షట్లర్ జూలీ డావాల్ జాకబ్సెన్ చేతిలో పోరాడి ఓడిపోయింది. అనుపమ ఉపాధ్యాయ16-–21, 10–-21తో రికో గుంజీ (జపాన్) చేతిలో పరాజయం పాలవగా.. ఆకర్షి కశ్యప్ కూడా ఇంటిదారి పట్టింది. అన్మోల్ ఖర్బ్, తస్నీమ్ మీర్, మెన్స్ సింగిల్స్లో శంకర్, కిరణ్ జార్జ్ తో పాటు మిక్స్డ్ డబుల్స్లో హేమ నాగేంద్రబాబు–- ప్రియ, ఆయుష్ అగర్వాల్–- శ్రుతి మిశ్రా, రోహన్ కపూర్– - రుత్వికా శివాని
జోడీలు తొలి రౌండ్లోనే ఓడిపోయాయి.