Lalit Modi: సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ‘ది హండ్రెడ్ 2026’ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ని రూ.2.34 కోట్లకు కొనుగోలు చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ నిర్ణయంపై భారత అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. లలిత్ మోడీ తాజాగా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కావ్య మారన్ పై వస్తున్న విమర్శలపై ఆయన చేసిన క్రిప్టిక్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్న సమయంలో పాకిస్తాన్ ఆటగాడిపై పెట్టుబడి పెట్టడం? ఇమేజ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో నాకు తెలుసు అని లలిత్ మోడీ పేర్కొన్నారు. కావాలంటే నన్ను సంప్రదించండి అంటూ సూచించారు.
అబ్రార్ అహ్మద్ ‘ది హండ్రెడ్’లో సన్రైజర్స్ లీడ్స్ తరఫున ఆడనున్నాడు. ఇది ఎస్ఆర్హెచ్కు అనుబంధ జట్టు కావడం గమనార్హం. వేలంలో అతను 10వ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు చెల్లించే డబ్బు పరోక్షంగా భారత సైనికులపై దాడులకు కారణమవుతుందని అభిప్రాయపడ్డారు. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడులు తర్వాత భారత ఫ్రాంచైజీలు పాక్ ఆటగాళ్లను దూరంగా ఉంచుతున్నాయని గుర్తు చేశారు.
ఇక అబ్రార్ అహ్మద్ ‘ది హండ్రెడ్ 2026’లో ఆడతాడా లేదా అన్నది ఇంకా గందరగోళంగానే ఉంది. అతనికి అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంది. అదే సమయంలో పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ఆడే అవకాశం ఉండటంతో, అతను టోర్నీలో పాల్గొనకపోవచ్చని తెలుస్తుంది.
