IPO News: డబ్బులు ఎవరికీ ఊరకే రావు.. అందుకే ఐపీవోకి వస్తున్న లలితా జ్యువెలరీ

IPO News: డబ్బులు ఎవరికీ ఊరకే రావు.. అందుకే ఐపీవోకి వస్తున్న లలితా జ్యువెలరీ

Lalithaa Jewellery Mart: బంగారం రిటైల్ విక్రయ వ్యాపారంలో పెద్ద మార్పులను తీసుకొచ్చిన సంస్థగా లలితా జ్యువెలరీని చెప్పుకోవచ్చు. మార్కెట్లో అందరి కంటే తక్కువ రేటుకు అందిస్తుంటేనే కొనుక్కోండి అంటూ సంస్థ యజమాని కిరణ్ యాడ్స్ సగటు పసిడి ప్రియులకు ఎంతగానో నచ్చుతుంటాయి. అయితే గడచిన్న కొన్నాళ్లుగా సంస్థ వేగంగా విస్తరణ బాట పట్టింది. ఈ క్రమంలోనే ఐపీవో ద్వారా డబ్బు సమీకరించాలని సంస్థ నిర్ణయించింది. 

లలితా జ్యువెలరీ సంస్థ తన ఐపీవో కోసం సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసినట్లు వెల్లడైంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.వెయ్యి 700 కోట్లను సమీకరించాలని చూస్తోందని వెల్లడైంది. ఇందులో రూ.వెయ్యి 200 కోట్లకు తాజా ఈక్విటీ ఉండగా మిగిలిన రూ.500 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కిరణ్ కుమార్ జైన్ తన వాటాల విక్రయానికి వెళుతున్నారని వెల్లడైంది. ఈ క్రమంలో కంపెనీ తన ఉద్యోగులకు తగ్గింపు ధరకు షేర్లను రిజర్వు చేయనుంది.

ALSO READ | అదృష్టం అంటే ఇదే.. తండ్రి లక్ష పెట్టి కొన్న స్టాక్స్.. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ.80 కోట్లు

ఐపీవో ద్వారా సమీకరించే మెుత్తాన్ని కంపెనీ దేశంలో కొత్త స్టోర్లను తెరిచేందుకు ఉపయోగించాలని నిర్ణయించింది. 1985లో స్థాపించబడిన కంపెనీ తొలుత చెన్నై నుంచి ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక నగరాలకు విస్తరించింది. కంపెనీకి చెన్నై, కాంచీపురంలో రెండు తయారీ యూనిట్లు ఉన్నాయి. అలాగే విజయవాడలో అతిపెద్ద స్టోర్ కలిగి ఉంది. 

డిసెంబరుతో ముగిసిన 9 నెలల కాలంలో కంపెనీ ఆదాయం రూ.12వేల 597కోట్లుగా ఉంది. ఇదే క్రమంలో లాభం రూ.262 కోట్లుగా ఉన్నట్లు తేలింది. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వస్తున్న ఐపీవో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో షేర్లు జాబితా కానున్నాయని తేలింది.