
- ప్రెస్ మీట్లో గోడు వెళ్లబోసుకున్న ర్యాంకర్లు
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రూప్–1 లో ర్యాంకులు సాధించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్పూర్తయి, మెడికల్ టెస్టులకు హాజరై పోస్టింగ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలంగాణ గ్రూప్–1 ర్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గ్రూప్–1 ర్యాంకర్లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయి విధుల్లో చేరుతామని అనుకునే సమయానికి ప్రభుత్వం తమ నియామకాలను ఆపేసిందన్నారు.
గ్రూప్–1కు 2022 నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయని, వాటన్నింటినీ దాటి ఇటీవల పరీక్షలు నిర్వహించి, ర్యాంకుల లిస్ట్ ఇచ్చిన ప్రభుత్వం సర్టిఫికెట్లను కూడా వెరిఫై చేసిందన్నారు. మెడికల్టెస్టులు కూడా చేసిందని, కానీ, అనుకోని కారణాల వల్ల నియామకాలను నిలిపేసిందని ఆవేదన చెందారు. ఈ నియమకాల్లో ఆలస్యం తమకే కాదని, మళ్లీ రాబోయే పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారందరికీ నష్టం కలిగిస్తాయన్నారు. త్వరగా వివాదాలు సద్దుమణిగించి, నియమకాలు జరిగేలా చూడాలని అభ్యర్థించారు.