కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలపై దేశం ఆశ్చర్యపోయింది

కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలపై దేశం ఆశ్చర్యపోయింది

సీఎం కేసీఆర్ చేసిన  రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు  లక్ష్మణ్. రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ కు  నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భీం దీక్షలో పాల్గొన్నారు లక్ష్మణ్. పవిత్ర గ్రంథంగా భావించే రాజ్యాంగం పట్ల కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలపై దేశం ఆశ్చర్యపోయిందన్నారు.  బడ్జెట్ పై నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యాంగం విషయం ఎందుకు వచ్చిందో అర్థంకావడం లేదన్నారు.  రెండేళ్లకు పైగా శ్రమించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారన్నారు. 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు.  అసమానతలు కూడిన దేశంలో సమానతలను తీసుకువచ్చేందుకు కృషి చేసిన మహనీయులు అంబేద్కర్ అని అన్నారు.  చిన్న రాష్ట్రాలు ఏర్పడడం వల్ల పరిపాలన సులభం అవుతుందని చెప్పిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్  రచించిన రాజ్యాంగ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.  రాష్ట్రపతి ప్రసంగాన్ని గౌరవించాల్సిన  టీఆర్ఎస్ బహిష్కరించి అవమానపరిచిందన్నారు.