మొదట రూ.లక్ష.. మర్నాడు రూ.30 వేలకు తగ్గింపు
ఇబ్రహీంపట్నం, వెలుగు: డబ్బుల కోసం నవజాత శిశువును విక్రయానికి కన్నతల్లే బేరం పెట్టింది. చట్టబద్ధ దత్తత కోసం చూస్తున్న వ్యక్తి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఎల్బీనగర్పోలీస్స్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ నగర్కు చెందిన ముక్తార్ బేగ్ చిన్న కుమార్తెకు సంతానం లేకపోవడంతో కుటుంబసభ్యులు చట్టబద్ధ దత్తతకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న బిహార్లోని కిషన్గంజ్ జిల్లాకు చెందిన లాల్మోన్ ఖాతూన్ అనే మహిళ ఈ నెల 7న ఎనిమిది రోజుల మగ శిశువుతో ముక్తార్ బేగ్ను సంప్రదించి, రూ.లక్ష డిమాండ్ చేసింది.
ఆయన నిరాకరించడంతో, మరుసటి రోజు రాత్రి రూ.30 వేలకే శిశువును ఇస్తానని బేరమాడింది. అనుమానం వచ్చిన ముక్తార్ బేగ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించి, మహిళను శిశువుతో సహా అప్పగించారు. విచారణలో పహాడీషరీఫ్లో కూలీ పనులు చేసే ఆ మహిళే కన్నతల్లని పోలీసులు తేల్చారు. నిందితురాలికి నోటీసులు జారీ చేసి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పర్యవేక్షణకు తరలించారు.
