మధిర/ సుజాతనగర్, వెలుగు: జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన భూ రీ సర్వే ప్రక్రియను ఆఫీసర్లు పరిశీలించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం తొండలగోపవరంలో జరుగుతున్న రీ సర్వేను అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి బుధవారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. గ్రామంలో మొత్తం 573 ఎకరాల విస్తీర్ణం ఉండగా, ప్రభుత్వ భూములు, రోడ్లు, డొంకలు, ఎన్ఎస్పీ కాలువల విస్తీర్ణం పోగా 508 ఎకరాల పట్టా భూములను గుర్తించారు. క్లస్టర్ల వారీగా ఇప్పటివరకు సుమారు 60 ఎకరాల్లో సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం, సర్వారం గ్రామాల్లో తొలివిడత రీ సర్వేను చేపట్టారు. రాఘవాపురంలో నిర్వహించిన గ్రామసభలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరావు రైతులకు రీ సర్వేపై అవగాహన కల్పించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కోసం 74 మంది రైతులకు చెందిన 28.39 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. భూసేకరణ, రీ సర్వేపై అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలని ఎమ్మార్వో కృష్ణప్రసాద్ సూచించారు.
