హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలోకి కుక్కలు, బర్రెలు చొరబడుతుండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా పద్మాక్షి గర్ల్స్ హాస్టల్లో రాత్రింబవళ్లు వరండాల్లో సంచరిస్తుండటంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు తరచూ దాడులు చేసి గాయపరుస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
గతంలో ఇదే హాస్టల్లో ఎలుకలు విద్యార్థినులను కొరికిన ఘటనలు చోటుచేసుకోగా, తాజాగా కుక్కలు, బర్రెల బెడదతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. హాస్టళ్లను పర్యవేక్షించాల్సిన డైరెక్టర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా హాస్టల్ రూమ్లు, వరండాల్లోకి జంతువులు, ఎలుకలు రాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
