హసన్పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, “జై శ్రీరామ్” తదితర కమర్షియల్ బ్రాండ్ల బస్తాల్లోకి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ వివరాల ప్రకారం.. శ్రీ లక్ష్మీ ప్రసన్న రైస్మిల్లుపై మంగళవారం రాత్రి దాడులు నిర్వహించి రూ.1.96 లక్షల విలువైన 56 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బియ్యంతో పాటు వెయింగ్ మెషిన్, రైస్ బ్యాగ్ స్టిచింగ్ మెషిన్ను సీజ్ చేశారు. ఈ కేసులో కాశబోయిన మొగిలి, బెజ్జంకి శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. హసన్పర్తి పరిసర ప్రాంతాల నుంచి పీడీఎస్ బియ్యాన్ని సేకరించి రీప్యాకింగ్ చేసి వివిధ దుకాణాలకు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై చర్యలు కొనసాగుతాయని ఏసీపీ మధుసూదన్ తెలిపారు.
