ఇండియా కార్ల మార్కెట్ చైనీస్ గుప్పిట్లోకేనా..?

ఇండియా కార్ల మార్కెట్ చైనీస్ గుప్పిట్లోకేనా..?

ముంబై: ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌ మెంట్(ఎఫ్‌‌డీఐ) రూల్స్‌‌ ను కఠినం చేసినా కూడా చైనా కంపెనీలు ఇండియాపైనే కన్నేశాయి. చైనాలోని లీడింగ్ ఆటో కంపెనీలన్ని ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యాయి. రెండు లేదా మూడేళ్లలో ఇండియాలో 500 కోట్ల డాలర్ల(రూ. 38,476 కోట్ల) వరకు పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నట్టు తెలిసింది. షాంఘైకు చెందిన ఎంజీ మోటార్, గ్రేట్ వాల్ మోటార్స్ ఇప్పటికే ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ప్లాన్స్‌‌ ను సిద్ధం చేశాయి. ఛంఘన్, ఛెర్రీ ఆటో కంపెనీలు ఇండియాలో హల్ చల్ చేసేందుకు అవకాశాల కోసం చూస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ మొత్తం చైనీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. మన స్మార్ట్ ఫోన్ మార్కెట్‌‌లో ఎక్కువ భాగం చైనీస్ కంపెనీలదే. ఇండియాలో రూ.5 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎంజీ మోటార్ వచ్చే ఆరు నెలల్లో డీల్ ఖరారు చేసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్రేట్ వాల్ మోటార్స్ కూడా కోట్ల కొద్దీ డాలర్లను ఇండియాలో కుమ్మరించడానికి ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆదేశాలు తమ ఫ్యుచర్ ప్లాన్స్‌‌ పై ఎలాంటి ప్రభావం చూపవని ఎంజీ మోటార్ ఇండియా ఎండీ రాజీవ్ ఛబ అన్నారు.

2021లో గ్రేట్ వాల్ మోటార్స్ వెహికల్ లాంచ్…

మహారాష్ట్రలోని ఖాళీగా ఉన్న జనరల్ మోటార్స్‌‌ ప్లాంట్‌‌ను ఈ ఏడాది ద్వితీయార్థంలో గ్రేట్ వాల్ మోటార్స్ టేకోవర్ చేసుకోబోతుంది. 2021లో ఇండియాలో వెహికల్ లాంచ్‌‌కు కూడా సిద్ధమైంది. గ్రేట్ వాల్ మోటార్స్ కు సపోర్ట్ ఇచ్చేందుకు వెస్ట్రన్ ఆటోమొటీవ్ బెల్ట్‌‌ లోని చైనీస్ వెండార్ కంపెనీలన్ని ఆ కంపెనీతో కలిసి పనిచేయడం ప్రారంభించాయి. ఇప్పుడు చైనీస్ పెట్టే పెట్టుబడులు ఇండియన్ ఆటో మార్కెట్ కాస్త ఊరటనివ్వనుందని తెలుస్తోంది.

అవకాశాల కోసం చూస్తోన్న ఛంగన్..

ఎంజీ మోటార్ ఇండియా, గ్రేట్ వాల్ మోటార్స్ ల ప్రత్యర్థి ఛంగన్‌‌ ఇప్పటికే గూర్గావ్‌‌లో ఆఫీసును కూడా ప్రారంభించింది. ఇండియా ప్రాజెక్ట్ కోసం చైనాలోని హెడ్ ఆఫీసు నుంచి పనిచేయడం మొదలు పెట్టింది. ఈ కంపెనీ లాక్‌‌డౌన్ అయిపోయాక పలు సర్వేలు చేయనుంది. ఏజెన్సీలతో కూడా సంప్రదింపులు జరుపుతోంది. ఇండియాలో ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికే ఏపీ, తమిళనాడు, గుజరాత్ లను సందర్శించింది.