
పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసిన చోటే ప్రతిష్టించాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ‘అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించి, దోషులను శిక్షించడం’ అనే సదస్సులో సి.పి.ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ఇతర వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. విగ్రహం కూల్చి వేసి రోజులు గడుస్తున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటనపై స్పందించకపోవడం అంబేద్కర్ ను అవమాన పరిచినట్టేనని అన్నారు.
చెత్త కుప్పలో వేయడం దారుణం: తమ్మినేని
రాజ్యాంగం రచించిన వ్యక్తి విగ్రహం చెత్త కుప్పలో వేయడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. దేశంలో మనుషుల మధ్య అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు. ఎవరైనా ఎక్కడైనా పార్టీల నాయకుల విగ్రహాలు పెట్టుకునే హక్కు ఉంటుంది కానీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అనుమతి లేకపోవడం శోచనీయమన్నారు. రానున్న రోజుల్లో..తెలంగాణ లో పెరిగి పోతున్న ఆర్ధిక , కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేపడతామని ఆయన అన్నారు.