కరోనాతో కంటే ఆకలితో ఎక్కువ మంది చనిపోతున్నారు: నారాయణ మూర్తి

కరోనాతో కంటే ఆకలితో ఎక్కువ మంది చనిపోతున్నారు: నారాయణ మూర్తి

భారతదేశంలో కరోనాను అరికట్టేందుకు లాక్‌డౌన్‌ను ప్రకటించింది ప్రభుత్వం. అయితే లాక్ డౌన్ ఇలాగే కొనసాగిస్తే కరోనాతో చనిపోయే మృతుల కంటే… ఆకలి బాధ కారణంగా చనిపోయే వారి సంఖ్యే అధికంగా ఉంటుందన్నారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి. కరోనా నుంచి ప్రజలను రక్షించే చర్యలు తీసుకుంటూనే, పలు సంస్థలను తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

దేశంలో ఏడాదికి 90 లక్షల మంది చనిపోతున్నారన్నారు నారాయణమూర్తి. కానీ కరోనా కారణంగా గత రెండు నెలల్లో సుమారు 1,000 మంది మాత్రమే చనిపోయారన్నారు. ఇదేం పెద్దగా భయపడాల్సిన విషయమేం కాదంటూ ఆయన ఓ ఇటర్వ్యూలో చెప్పారు.

భారత్ లో 190 మిలియన్ల మంది భారతీయులు అసంఘటిత, స్వయం ఉపాధి రంగాల్లో పని చేస్తున్నారని నారాయణమూర్తి చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో ఇంత మంది ఇబ్బందులుపడుతున్నారన్నారు. కరోనా లాక్‌డౌన్‌ దీర్ఘకాలంగా కొనసాగితే మాత్రం చాలా మంది జీవనోపాధిని కోల్పోతారని స్పష్టం  చేశారు. ఇండియాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. ఇప్పటికే చాలా మంది అతితక్కువ ధరకు పలు రకాల పరికరాలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. భారత్‌లో మరణాల రేటు ఇతర దేశాలతో పోల్చుకుంటే తక్కువగా ఉందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్‌లో కరోనా కేసుల మరణాల రేటు చాలా తక్కువగా ఉందన్నారు. లాక్‌డౌన్‌ తో భారత్‌లో చాలా వరకు కరోనా కేసుల సంఖ్యను తగ్గించగలిగామన్నారు నారాయణమూర్తి.