- రానున్న బడ్జెట్లో ట్యాక్స్పేయర్లకు ఉపశమనం
- రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారిపై ఫోకస్!
- వినియోగం పెంచేందుకు రూ.50 వేల కోట్ల ప్రయోజనాలు
న్యూఢిల్లీ: దేశంలో వినియోగం పెంచేందుకు రానున్న బడ్జెట్లో రూ.50 వేల కోట్ల విలువైన ప్రయోజనాలను ప్రభుత్వం ప్రకటించనుందని అంచనా. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ రేట్లను తగ్గించడం, ఇతర నిర్ణయాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి రానున్న బడ్జెట్లో ఉపశమనం దొరకొచ్చని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ కేటగిరీలో ఉన్నవారిపై 5 శాతం నుంచి 20 శాతం వరకు ట్యాక్స్ పడుతోంది. రానున్న బడ్జెట్లో కొత్త స్లాబ్ను ఏర్పాటు చేసే వీలు కూడా ఉంది. ట్యాక్స్ రిలీఫ్స్ ఇవ్వడంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. రిలీఫ్ చర్యల వలన ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిస్కల్ డెఫిసిట్ను జీడీపీలో 5.1 శాతానికే కుదించాలని కేంద్రం టార్గెట్గా పెట్టుకుంది.
ఆర్బీఐ డివిడెండ్తో డెఫిసిట్ కంట్రోల్లో
రూ.50 వేల కోట్ల విలువైన రిలీఫ్ చర్యల్లో సగం ట్యాక్స్ రేట్లను తగ్గించడం ద్వారా ప్రభుత్వం అందించనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. దీంతో పాటు చిన్న రైతులకు ఇచ్చే క్యాష్ పేమెంట్స్ ప్రస్తుతం ఉన్న ఏడాదికి రూ.6,000 నుంచి రూ.8 వేలకు పెంచాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఉపాధి హామీ పథకం కింద చెల్లించే కనీస వేతనాలను కూడా పెంచాలని, మహిళా రైతులకు ఆర్థిక సాయం అందించాలని చూస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇండస్ట్రీ వర్గాలు, ఎకనామిస్ట్లు, ట్రేడ్ యూనియన్లతో ప్రీ బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తున్నారు.
తాజా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను ఆకర్షించే స్కీమ్లను బడ్జెట్లో ప్రకటించొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు రానున్న నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో కూడా ప్రజలను ఆకర్షించే స్కీమ్లను ప్రభుత్వం ప్రకటిస్తుందని అంచనా. ఆర్బీఐ నుంచి రూ. 2.1 లక్షల కోట్ల డివిడెండ్ను అందుకోనుండడంతో ఫిస్కల్ డెఫిసిట్ను ప్రభుత్వం కంట్రోల్ చేయగలుగుతుందని నిపుణులు వివరించారు.
వ్యవసాయ రంగానికి ఏంకావాలంటే?
వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు, సంస్థలు ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారా మన్ను కలిశారు. అగ్రికల్చర్ రీసెర్చ్కు ఫండ్స్ పెంచాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరచా లని, వాతావరణ మార్పులు వచ్చినా రైతులు నిలబడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కు కేటాయించే ఫండ్స్ రూ.20 వేల కోట్లకు పెంచాలని, ఎంఎస్పీ కమిటీని రద్దు చేయాలని, కొత్త అగ్రికల్చరల్ పాలసీని తేవాలని, వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు