
- రాష్ట్ర సెక్రటేరియెట్లో క్లాప్ ఫర్ చిల్ర్డన్ పోస్టర్ ఆవిష్కరణ
- యునిసెఫ్తో కలిసి కార్యాచరణ ప్రకటించిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: పిల్లలకు హైదరాబాద్ ను సురక్షిత నగరంగా మార్చుతామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. యునిసెఫ్ తో కలిసి రూపొందించిన ‘క్లాప్ ఫర్ చిల్డ్రన్’ పోస్టర్ ను గురువారం సచివాలయంలో మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. పిల్లల విషయంలో ఇతర సిటీలకు ఆదర్శంగా ఉండేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఈ ప్రయత్నంలో యునిసెఫ్ సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రణాళిక ద్వారా ప్రభుత్వ విభాగాలు, చట్టపరమైన సంస్థలు కలిసి పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదగడానికి కృషి చేస్తాయని పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, పోలీసు, ఆరోగ్యం, విద్య, కార్మిక శాఖలు, జీహెచ్ఎంసీ వంటి ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ ఈవ్-టీజింగ్, బుల్లీయింగ్, పిల్లల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించడానికి చర్యలు చేపడతాయని వెల్లడించారు.
బాలల రక్షణ సెల్లు, విజిలెన్స్ కమిటీల ద్వారా డేటా ఆధారిత మానిటరింగ్ జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, యునిసెఫ్ చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ డా. జెలాలెం బిర్హాను టాఫెస్సే తదితరులు పాల్గొన్నారు.