
- ఇన్సూరెన్స్ చట్టానికి సవరణలు చేయనున్న ప్రభుత్వం
- ఒకే కంపెనీ హెల్త్, జనరల్, లైఫ్ ఇన్సూరెన్స్లను అమ్మేందుకు కాంపోజిట్ లైసెన్స్
- సింగిల్ పాలసీలోనే హెల్త్, లైఫ్ కవర్!
- తగ్గనున్న కంపెనీల ఖర్చులు
- హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇంటర్నల్గా పనిచేస్తున్నామన్న ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్ధ మహంతి
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో లీడర్గా కొనసాగుతున్న ఎల్ఐసీ , హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్లోకి కూడా ఎంటర్ అవ్వాలని చూస్తోంది. అవకాశం వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతామని కంపెనీ చైర్మన్ సిద్ధార్ధ మహంతి పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ చట్టాన్ని సవరిస్తే ఎల్ఐసీకి కాంపోజిట్ లైసెన్స్ దొరుకుతుందనే అంచనాలు ఉన్నాయి. కాగా, ఇన్సూరెన్స్ చట్టం, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) రూల్స్ ప్రకారం, లైఫ్, జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్లను ఒకే కంపెనీ అమ్మకూడదు.
ఫైర్, ఇంజినీరింగ్ వంటి జనరల్ ఇన్సూరెన్స్లో ఎల్ఐసీ ఎక్స్పర్ట్ కాదని, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో దూసుకుపోగలదని సిద్ధార్ధ మహంతి అన్నారు. మెర్జర్లు, టేకోవర్ల ద్వారా ఈ సెగ్మెంట్లో విస్తరిస్తామని, ఇంటర్నల్గా వర్క్ జరుగుతోందని వివరించారు. జనరల్, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లను ఒకే కంపెనీ అమ్మడానికి వీలు కలిపించేందుకు కాంపోజిట్ లైసెన్స్ ఇష్యూ చేయాలని ఈ ఏడాది ఫ్రిబవరిలో పార్లమెంటరీ ప్యానెల్ సలహా ఇచ్చింది. దీనికి సంబంధించి చట్ట పరమైన సవరణలు చేయాలని బీజేపీ లీడర్ జయంత్ సిన్హా నేతృత్వంలోని ఈ ప్యానెల్ పేర్కొంది.
కాంపోజిట్ లైసెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలు మరింత మందిని చేరుకోవడానికి వీలుంటుంది. వివిధ ఇన్సూరెన్స్ బిజినెస్లను ఒక రూఫ్ కింద చేయడానికి వీలుండడంతో కంపెనీల ఖర్చులు తగ్గుతాయని పార్లమెంటరీ ప్యానెల్ పేర్కొంది. మరోవైపు కస్టమర్లకు బోలెడు ప్రయోజనాలు ఉంటాయని, హెల్త్, లైఫ్ కవర్ చేసే సింగిల్ పాలసీలు అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడింది. తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్లను పొందడానికి వీలుంటుందని, క్లెయిమ్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చని పార్లమెంటరీ ప్యానెల్ వివరించింది.
కాగా, ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్లో ఎల్ఐసీకి రూ.13,763 కోట్ల నికర లాభం, రూ. 2,50,923 కోట్ల ఆదాయం వచ్చింది. 2023–24 ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే కంపెనీకి రూ.40,676 కోట్ల నికర లాభం, రూ.4,75,070 కోట్ల మొత్తం ఆదాయం వచ్చింది. ఈ కంపెనీ మొత్తం 2,04,28,937 పాలసీలను కిందటి ఆర్థిక సంవత్సరంలో అమ్మగలిగింది. ఎల్ఐసీ 2023–24 కి గాను షేరుకి రూ.6 డివిడెండ్ ప్రకటించింది. గతంలో ఇచ్చిన ఇంటెరిమ్ డివిడెండ్ రూ.4 కలుపుకుంటే కంపెనీ షేరుకి రూ.10 డివిడెండ్ ఇచ్చినట్టు. ఎల్ఐసీ షేర్లు మంగళవారం 2 శాతం పడి రూ.1,014 దగ్గర ముగిశాయి.