
గాంధీ భవన్ లో మంగళవారం (జూన్ 24) పీఏసీ మీటింగ్ వాడీవేడిగా జరిగింది. తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్కతో పాటు మంత్రులు, పీసీసీ కార్యవర్గం పాల్గొన్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ఈ మీటింగ్ లో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ నిర్మాణంపై చర్చించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
బూత్ లెవెల్ నుంచి పార్టీ పటిష్టతకు పని చేయాలని.. అందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనీ పీసీసీ కి సూచన చేసినట్లు తెలిపారు. ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చర్చించామని అన్నారు. ఈ కాలాన్ని గోల్డెన్ పీరియడ్ గా పీఏసీ అభినందనలు తెలిపిందని చెప్పారు.
ALSO READ | గాంధీ భవన్లో ధర్నాలపై సీఎం రేవంత్ సీరియస్.. ఇంచార్జ్ మంత్రులకు కీలక బాధ్యతలు
పంట నష్ట పరిహారాన్ని గత ప్రభుత్వం పదేళ్ళు పట్టించుకోలేదని.. కానీ ప్రజా పాలనలో రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పథకాలు అమలు చేస్తున్నామని.. ఈ ప్రభుత్వ పథకాలు ఇంటింటికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు గా రెండింటిని సమంగా ముందుకు తీసుకెళ్తున్నామని భట్టీ తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కచ్చితంగా గెలవాల్సిందే: మీనాక్షి నటరాజన్
పీఏసీ మీటింగ్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన సన్నాహాలను అడిగి తెలుసుకున్నారు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్. ఉప ఎన్నికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఉప ఎన్నికలో కచ్చితంగా గెలవాల్సిందేనని ఆమె సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం గ్రేటర్ పరిధిలోని నాయకులందర్నీ సమన్వయం చేయాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు బాధ్యతలు అప్పగించారు.
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కు ఎవరిని నియమిస్తున్నారని అడిగిన ప్రశ్నకు.. ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదని సీఎం రేవంత్ చెప్పారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడకూడదని ఆదేశించారు. పార్టీ నిర్ణయించి అభ్యర్థిని ప్రకటించే వరకు ఎవరూ కామెంట్స్ చేయొద్దని సూచించారు.
పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని హెచ్చరించారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా తమ సేవలను ఉపయోగించుకోవాలని పలువురు సీనియర్లు తెలిపారు. అయితే పదవులు వచ్చిన వాళ్ళు రాష్ట్రమంతా తిరిగి పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు సీఎం.
పీఏసీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హాట్ హాట్ గా చర్చ జరిగింది. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రులు కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో తమపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. ప్రతి చిన్న పనికి మంత్రుల వద్దకు రావడంతో పని భారం పెరుగుతుందని తెలిపారు. వీలైనంత త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దామని.. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు మంత్రులు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు.