
గాంధీ భవన్ లో ధర్నాలు చేయడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. మరోసారి ధర్నాలు చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అంతేకాని ధర్నాలు, గొడవలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇవాళ (జూన్ 24) గాంధీ భవన్ లో పీఏసీ మీటింగ్ సందర్భంగా గాంధీ భవన్ లో ధర్నాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాయకుల అభిప్రాయాలు, సమస్యలు చెప్పుకోడానికి పీసీసీ చీఫ్ ఉన్నారని.. లేదంటే సీఎంగా తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నానని తెలిపారు. తమకు ఏదైనా సమస్య గురించి చెబితే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అంతేకాని ధర్నాల వలన ఎలాంటి లాభం లేదని చెప్పారు సీఎం రేవంత్.
నామినేట్ పోస్టులు భర్తీకి మంత్రులకు ఆదేశం:
ఇంఛార్జి మంత్రుల పనితీరుపై కూడా పీఏసీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. నామినేటెడ్ పోస్టులు భర్తీ విషయంలో ఆలస్యం చేయవద్దని.. వెంటనే జిల్లాల్లో పదవులు భర్తీ చేయండని మంత్రులకు సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇంఛార్జ్ మంత్రులదేనని ఈ సందర్భంగా చెప్పారు. నిధులు.. బాధ్యతలు అన్నీ మంత్రుల దగ్గరే ఉన్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 99శాతం గెలిచేలా ఇంఛార్జి మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలపై ఇంఛార్జ్ మంత్రులు సరిగ్గా దృష్టిపెట్టడం లేదని అన్నారు. ఇక నుంచి జిల్లాలపై ఫోకస్ చేయాలని సూచించారు సీఎం రేవంత్.
పీసీసీ కార్యవర్గంలో ఉన్న వారిని రెండు గ్రూపులుగా జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. ముందు అందరికీ పని అప్పగించాలని.. దీని ఆధారంగా పనిచేసే వాళ్లను ఒక జాబితా.. పని చేయని వాళ్లది మరో జాబితాలో చేర్చాలని సూచించారు. పని చేస్తే ప్రమోషన్.. లేదంటే డిమోషన్ ఉంటుందని తెలిపారు.