రూ. 448 కోట్ల పెయింటింగ్.. వందేండ్లకు దొరికింది

 రూ. 448 కోట్ల పెయింటింగ్..  వందేండ్లకు దొరికింది

వియన్నా:  ఆస్ట్రియాలో 100 ఏండ్ల క్రితం కనిపించకుండా పోయిన 54 మిలియన్ డాలర్ల (రూ. 448 కోట్లు) విలువైన పెయింటింగ్ ఎట్టకేలకు దొరికింది. వియన్నా వేలం సంస్థ కిన్స్కీ దీనిని ఏప్రిల్ 24న వేలం వేయనుంది. ‘పొర్ట్రెయిట్ ఆఫ్​ పౌలిన్ లీజర్’ అనే ఈ పెయింటింగ్ ను ఫేమస్ ఆస్ట్రియన్ ఆర్టిస్ట్ గుస్తావ్ క్లిమ్ట్ చిత్రీకరించారు.  ఈ పెయింటింగ్ చివరగా 1925లో బహిరంగంగా కనిపించింది.

తర్వాత దీని ఆచూకీ తెలియలేదు. 1960ల నుంచి ఓ యూదు ఫ్యామిలీ అధీనంలో ఉంది. గుస్తావ్ క్లిమ్ట్ పెయింటింగ్స్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఉన్నత మధ్య తరగతి నుంచి విజయవంతమైన మహిళల చిత్రాలు వేస్తారని ఆయన పేరు పొందారు. గుస్తావ్ పెయింటింగ్స్ చాలా అరుదుగా వేలానికి వస్తాయి. ఈ పెయింటింగ్ ను వేలానికి ముందు అనేక చోట్ల ప్రదర్శించనున్నారు. ప్రదర్శనల తర్వాత ఏప్రిల్ లో వేలం వేయనున్నారు.