
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే ఇండియాలోని ఇళ్లల్లో గ్యాస్ స్టవ్ లు వెలగవా.. గ్యాస్ సిలిండర్ల సంక్షోభం రాబోతుందా.. ఇలాంటి భయాలు ఇప్పుడు భారతదేశం జనాన్ని భయపెడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ఎక్కువ రోజులు జరిగితే.. మన గ్యాస్ సిలిండర్లకు వచ్చిన సంక్షోభం ఏంటీ అనేది తెలుసుకుందామా..
మూడింట.. రెండు వంతులు పశ్చిమాసియా నుంచే :
భారతదేశంలో గృహ వినియోగం కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్లలో మూడింట రెండు వంతులు పశ్చిమాసియా దేశాల నుంచే వస్తుంది. ఇండియా LPG వినియోగంలో 66 శాతం దిగుమతి చేసుకుంటుంది. ఈ దిగుమతి చేసుకునే LPG గ్యాస్ లో 95 శాతం సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, ఖతార్ నుంచి వస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే.. అది పశ్చిమాసియా దేశాల నుంచి రవాణా ఇబ్బందులు ఏర్పడవచ్చు.. దీంతో ఇండియా గ్యాస్ సంక్షోభం రావొచ్చని భయపడుతున్నారు నిపుణులు. ప్రస్తుతం ఇండియాలో 33 కోట్ల ఇళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా కొనసాగుతుంది.
ప్రస్తుత నిల్వలు 16 రోజుల వరకు :
2025, జూన్ 22వ తేదీ నాటికి.. ఇండియాలో ఉన్న LPG గ్యాస్ నిల్వలు 16 రోజుల వరకు మాత్రమే సరిపోతుంది. పశ్చిమాసియా దేశాల నుంచి రవాణా సాఫీగా సాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.. అలా కాకుండా ఏదైనా అవాంతరాలు ఏర్పడితే మాత్రం గ్యాస్ సిలిండర్ల సరఫరాకు బ్రేక్ పడనుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ప్రత్యామ్నాయం లేదా.. ?
పశ్చిమాసియా దేశాల నుంచి LPG సరఫరాకు బ్రేక్ పడితే పరిస్థితి ఏంటీ అనే ప్రశ్నకు.. సమాధానం కూడా ఉంది. అమెరికా, యూరప్, మలేషియా దేశాల నుంచి గ్యాస్ దిగుమతి చేసుకోవచ్చు. కాకపోతే దీనికి సమయం పడుతుంది. రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అత్యవసరానికి అయితే పర్వాలేదు.. అలా కాకుండా ఆ దేశాల నుంచే పూర్తిగా ఆధారపడితే మాత్రం ఖర్చుతో కూడుతున్న వ్యవహారం. అత్యవసరాలకు అయితే పర్వాలేదు అంటున్నారు నిపుణులు.
Also Read : పుర్రెపై ఇజ్రాయెల్.. ఇరాన్ సుప్రీం వార్నింగ్ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా..?
రెండు వారాలుగా జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా రావటంతో పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన నెలకొంది. ఈ యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగుతుందని బలంగా నమ్ముతున్నారు. ఇదే జరిగితే పశ్చిమాసియా దేశాల ఎగుమతి అయ్యే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. ఇదే జరిగితే ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకునే భారత్ వంటి దేశానికి పెను సవాల్ అంటున్నారు ఇంధన నిపుణులు. ముఖ్యంగా LPG విషయంలో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇండియాలో గ్యాస్ సిలిండర్ల సంక్షోభం కొరతతో.. మన వంటిట్లో గ్యాస్ స్టవ్ వెలిగే పరిస్థితి ఉండదని హెచ్చరిస్తున్నారు.