- అంతర్రాష్ట్ర సంతల ద్వారా తెలంగాణలోకి
- ఇప్పటికే 25 జీవాలు మృతి
- భూపాలపల్లి జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో వ్యాప్తి
హైదరాబాద్/వనపర్తి, వెలుగు : రాష్ట్రంలో లంపీ స్కిన్ వ్యాధి విజృంభిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మినహా మిగిలిన 32 జిల్లాల్లోని 786 గ్రామాల్లో ఈ వ్యాధి విస్తరించింది. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఒంగోలు, జెర్సీ, హెచ్ఎఫ్ తదితర రకాలకు చెందిన 7,752 ఎడ్లు, ఆవులు ఈ వ్యాధి బారినపడగా.. 25 పశువులు చనిపోయాయి. 2,532 పశువులు కోలుకున్నాయి. ఇంకా 5,145 పశు వులు లంపీ స్కిన్తో బాధపడుతున్నాయని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్ వెల్లడించారు. రాష్ట్రంలో 42 లక్షల ఆవులు, ఎడ్లు ఉన్నాయి. అక్టోబర్ ప్రారంభం నుంచి వ్యాధికారక క్యాప్రిపాక్స్ వైరస్ విస్తరిస్తోంది. వ్యాధి సోకిన పశువులను ఐసొలేషన్లో ఉంచడంతో పాటు..ఇప్పటివరకు 5,48,511 పశువులకు వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటి వరకు యాదాద్రి, గద్వాల జిల్లాల్లో 8 చొప్పున పశువులు చనిపోయాయి. నాగర్కర్నూల్ జిల్లాలో 6, జనగామ, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో పశువు చనిపోయింది.
వానలతో విజృంభిస్తున్న వైరస్
వర్షాల వల్ల పశువుల పాకలు బురదగా, అపరిశుభ్రంగా ఉండడంతో ఈగలు, దోమలు, గోమార్ల ద్వారా లంపీస్కిన్కు కారణమైన వైరస్ ప్రబలుతున్నది. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల నుంచి ఈ వైరస్ దక్షిణాదికి పాకింది. మహారాష్ట్ర, హర్యానా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, చ త్తీస్గఢ్, ఏపీ మీదుగా వైరస్ తెలంగాణకు వ్యాపించిందని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో 30శాతం పశువులపై వ్యాధి ప్రభావం ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లోని గోశాలల్లోనూ లంపీ స్కిన్ కనిపిస్తోంది. రోజువారీగా మానిటర్ చేస్తూ రాష్ట్రమంతటా వ్యాక్సినేషన్ మొదలుపెట్టారు.
వెంటాడుతున్న వెటర్నరీ డాక్టర్ల కొరత
లంపీ స్కిన్ వ్యాధిని ముందుగానే గుర్తించి నివా రణ చర్యలు తీసుకోవాల్సిన వెటర్నరీ డిపార్ట్ మెంట్ అధికారులు క్షేత్రస్థాయిలో చేతులెత్తేశారు. వెటర్నరీ దవాఖానాల్లో డాక్టర్ల కొరత ఉంది. జిల్లా, డివిజన్ కేంద్రాల్లోని వెటర్నరీ హాస్పిటళ్లలో నూ సరైన వైద్యం అందడంలేదు. ఈ వ్యాధి నివారణకు ప్రత్యేకంగా మందులు అందుబాటులో లేవు. చర్మవ్యాధి, ఎలర్జీలకు సంబంధించిన టీకా లే ఇస్తున్నారు. ప్రైవేట్ మందుల దుకాణాల నుంచే మందులు, టీకాలు కొనుక్కుంటున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి..
అంతరాష్ట్ర పశువుల సంతల నుంచి వ్యాధి రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు గుర్తించిన అధికారులు అప్రమత్తమై అన్ని సంతల్లో ఒక వెటర్నరీ డాక్టర్, కాంపౌండర్ తో కూడిన చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. వ్యాధి లక్షణాలు ఉన్న పశువులను గుర్తించి సంతలోకి అనుమతించడం లేదు. వనపర్తి జిల్లాలోని పెబ్బేరులో ప్రతి శనివారం పశువుల సంత జరుగుతుంది. ఇక్కడకు కర్నాటక, ఏపీ నుంచి పశువులను అమ్మకానికి తెస్తుంటారు. కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, కంగ్టి, నారాయణఖేడ్లలోనూ పశుసంవర్ధక, పోలీసు శాఖలు పశువుల రవాణాపై నిఘా పెట్టాయి. మంచిర్యాల జిల్లాలో 9వేల పశువులకు వ్యాక్సిన్ వేశారు. మహారాష్ట్ర వైపు నుంచి వ్యాధిసోకిన పశువులు రాకుండా కోటపల్లి మండలం లక్ష్మిపురం వద్ద చెక్ పోస్ట్ పెట్టారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో ఈ వ్యాధికి నాలుగు పశువులు బలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 17 వేల పశువులకు టీకాలు వేవారు.
లంపీస్కిన్ లక్షణాలివే..
ఆవులకు, ఎద్దులకు చర్మమంతా పొలుసులుగా మారుతుంది. చర్మంపై గడ్డలు వచ్చి పగిలి ఎర్రగా మారతాయి. కంటి నుంచి నీరు కారడం, తీవ్రమైన ఒళ్లు నొప్పులతో పశువులు జ్వరం బారిన పడతాయి. ఆవుల్లో పాల దిగుబడి తగ్గుతుంది. సూడి ఆవులు ఇడ్చుకుపోతాయి. దీంతో పశువులు మేత మేయకుండా అనారోగ్యం పాలవుతాయి
నివారణ చర్యలు ఇలా...
వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వ్యాధి సోకిన పశువులను మిగతా వాటితో కలవనివ్వద్దు. పశువుల కొట్టంలో దోమలు, ఈగలు, గోమార్లు రాకుండా దోమ తెరలు ఏర్పాటు చేయాలి. వ్యాధి సోకిన పశువులకు రాగిజావ, నూకల జావ, పచ్చిగడ్డి, విటమిన్లు అందించాలి.
మందులు ఇవ్వండి
వనపర్తి జిల్లా అమరచింత పశు వైద్యశాలలో లంపీస్కిన్ కు మందులు లేవంటున్నరు. డాక్టర్ తో పాటు కాంపౌండర్, టెక్నీషియన్స్ ఉండాల్సిన ఈ ఆస్పత్రిలో కాంపౌండర్ అతనికి తనకు తోచిన వైద్యం చేస్తున్నడు. మదనాపురం పశు వైద్యశాలలో ఒక్క కాంపౌండరే ఉన్నడు. సిబ్బంది కొరతతో మొబైల్ వెటర్నరీ వెహికల్కూడా గ్రామాలకు రావడం లేదు.
- బాలయ్య, రైతు, అమరచింత