
సంపూర్ణ చంద్రగ్రహణం ప్రపంచ వ్యాప్తంగా కనువిందు చేసింది. చాలా ప్రదేశాల్లో బ్లడ్ మూన్ లా దర్శనమిచ్చింది. ఈ ఏడాది రెండో సారి ఏర్పడిన గ్రహణాన్ని.. ఖగోళ అద్భుతంగా శాస్త్రవేత్తలు అభివర్ణించారు. ఆదివారం రాత్రి 9.56 గంటలకు మొదలైన గ్రహణం అర్ధరాత్రి 1.26 గంటల వరకు కొనసాగింది. గ్రహణం సంపూర్ణ స్థాయి రాత్రి 11.01 గంటల నుంచి మొదలై 12.23 గంటల వరకు 82 నిమిషాలపాటు కనిపించింది.
సంపూర్ణ చంద్రగ్రణహం చాలా ప్రదేశాల్లో ఎరుపు రంగులో దర్శనమిచ్చింది. ఇండియాలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్, లక్నో, తదితర అన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపించగా, అనేక చోట్ల పున్నమి చంద్రుడు ఎరుపు రంగు పులుముకున్న ‘బ్లడ్ మూన్’లా కనువిందు చేశాడు.
ఇక చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం నుంచే దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ మూతపడ్డాయి. గయలోని విష్ణుపాద టెంపుల్, ఉజ్జయినిలోని మహాకాలేశ్వర్ టెంపుల్, ఏపీలోని శ్రీకాళహస్తి టెంపుల్ మాత్రం తెరిచే ఉంచి, ప్రత్యేక పూజలు, క్రతువులు నిర్వహించారు. మూతపడిన ఆలయాలన్నీ సోమవారం తెల్లవారిన తర్వాతే తిరిగి తెరుచుకోనున్నాయి.