మహా న్యూస్ ఛానెల్ ఆఫీసుపై BRS దాడి : ఖండించిన ప్రముఖులు

మహా న్యూస్ ఛానెల్ ఆఫీసుపై BRS దాడి : ఖండించిన ప్రముఖులు

మహా న్యూస్ ఛానెల్ ఆఫీసుపై దాడి జరిగింది. 2025, జూన్ 28వ తేదీ మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. 30 నుంచి 40 మంది వరకు ఉన్న వాళ్లు.. వస్తూ వస్తూనే.. ఆఫీసు ఎదుట ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశారు. పెద్ద పెద్ద రాళ్లను కార్లపై వేశారు. కార్లను పూర్తిగా ధ్వంసం చేశారు. 

ఆ వెంటనే మరికొంత మంది ఆఫీసుపై రాళ్లు వేశారు. రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న కిటికీలు ధ్వంసం అయ్యాయి. ఈ రాళ్లు ఆఫీసులో పని చేస్తున్న ఉద్యోగులపై పడ్డాయి. కొంత మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. 

ఆఫీసుకు దూసుకెళ్లిన బీఆర్ఎస్ కార్యకర్తలు.. ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కంప్యూటర్లు పగలగొట్టారు. రాళ్లు, కర్రలు, రాడ్లతో విధ్వంసం చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. ఆఫీసులో బీభత్సం చేశారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణకు సంబంధించి.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోని అంశాలపై మహా న్యూస్ ఛానెల్ లో కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ కథనాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అప్పటి మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నాయంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు.. మహా న్యూస్ ఛానెల్ యాజమాన్యం స్పష్టం చేసింది. మీడియాలో వచ్చిన కథనాలపై అభ్యంతరాలు ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం అని ఉద్యోగులు, సిబ్బంది చెప్పినా వినకుండా.. అత్యంత దారుణంగా.. కిరాతకంగా దాడి చేసినట్లు చెబుతున్నారు అక్కడి ఉద్యోగులు. 

మహాన్యూస్ ఛానెల్ పై దాడిని చాలా మంది ఖండించారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తోపాటు ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు. మీడియా స్వేచ్ఛను దాడులతో అణిచివేస్తాం అనుకుంటే పొరపాటు అంటూ చెప్పుకొచ్చారు. భౌతిక దాడులు సరికాదన్నారు. నిందితులను ఇప్పటికే గుర్తించాం అని.. త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మీడియాపై దాడి అనేది హేయమైన చర్య అంటూ ఖండించారు మంత్రి.

మహా న్యూస్ ఛానెల్ ఆఫీసులో బీఆర్ఎస్ కార్యకర్తల విధ్వంసంపై మీడియా అసోసియేషన్లు కూడా స్పందించాయి. దాడిని ఖండించారు.