చిన్నారి కిడ్నాప్.. 4 రోజుల్లోనే తల్లి ఒడికి

చిన్నారి కిడ్నాప్.. 4 రోజుల్లోనే తల్లి ఒడికి

మహబూబ్ నగర్: నాలుగు రోజుల కింద కిడ్నాప్ కు గురైన రెండు నెలల పాపను శుక్రవారం తల్లి ఒడికి చేర్చారు పాలమూరు పోలీసులు. జూలై- 13న  రాత్రి 10.45 ని.లకు జిల్లా కేంద్రంలోని వల్లబ్ నగర్ ఎర్రగుట్ట ప్రాంతంలో, బిడ్డను ఒడిలోపెట్టుకుని గాఢ నిద్రలో మునిగిపోయింది తల్లి. ఎవరూలేని సమయంలో పసిపాపను కిడ్నాప్ చేశారు నలుగురు నిందితులు. పసి పాపను పది వేల రూపాయలకు అమ్ముతుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పసిపాపతో సహా నిందితులను అదుపులోకి తీసుకున్న తీరు చెప్పుకోదగినదని పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. శ్రీమతి రెమా రాజేశ్వరి గారు పాత్రికేయుల సమావేశంలో నేరం జరిగిన తీరును వివరిస్తూ, నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరు పరుస్తామని తెలిపారు. చిన్నారిని తల్లికి అందిస్తూ, కొన్ని కేసుల పరిశోధన వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా ఆత్మసంతృప్తినిస్తాయని సంతోషపడ్డారు పోలీసులు. ఈ కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్.పి.  ఎంతగానో అభినందిస్తూ, రివార్డులు ప్రకటించారు.