మహబూబాబాద్, వెలుగు: పోషణ భారం, వద్దనుకునే వారు పసిపిల్లలను చెత్తకుప్పలు, చెట్లపొదల్లో వేయకూడదని, ఆస్ప్రతిలో ఏర్పాటు చేసిన ఊయలలో వేయండని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో ‘ఊయల’, కలెక్టరేట్లో దత్తత సహాయ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పసిపిల్లలను ఎక్కడపడితే అక్కడ వదిలేయవద్దని, ప్రభుత్వానికి అప్పగిస్తే చట్టబద్ధంగా దత్తత ఇస్తామని అన్నారు.
దత్తత తీసుకోవాలనే దంపతులకు సరైన విధానం నియమాలను నమోదుపై వాత్సల్య పోర్టల్ www.missionvastalya.wwd.gov.in ద్వారా పిల్లల అడాప్షన్ ప్రక్రియను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎం హెచ్వో రవి రాథోడ్, జిల్లా ఇన్చార్జి సంక్షేమ అధికారి శిరీష ,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి తదితరులున్నారు.
