కొత్తపల్లి ఇసుక రీచ్ కు .. అనుమతులు రద్దు : కలెక్టర్ విజయేందిర బోయి

కొత్తపల్లి ఇసుక రీచ్ కు .. అనుమతులు రద్దు : కలెక్టర్ విజయేందిర బోయి
  • ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ విజయేందిర బోయి

జడ్చర్ల/మిడ్జిల్, వెలుగు: మహబూబ్‌‌‌‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి రీచ్‌‌‌‌ లో ఇసుక తవ్వకాలకు ఇచ్చిన పర్మిషన్‌‌‌‌ను  కలెక్టర్ విజయేందిర బోయి రద్దు చేస్తూ మంగళవారం ఉత్తుర్వులు జారీ చేశారు. కొంత కాలంగా రీచ్‌‌‌‌లో రూల్స్ కు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, పరిమితికి మించి ఇసుకను ట్రక్కుల్లో నింపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆ ప్రాంత రైతులు, గ్రామస్తులు ఇటీవల కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు  ఫిర్యాదులు చేశారు. కలెక్టర్ సోమవారం విచారణకు ఆదేశించగా..  మైనింగ్ ఏడీ సంజయ్ కుమార్, మహబూబ్‌‌‌‌ నగర్ ఆర్డీవో నవీన్, స్థానిక తహసీల్దార్ పులిరాజు, ఎస్.ఐ శివనగేశ్ నాయుడు సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో కొత్తపల్లి ఇసుక రీచ్‌‌‌‌ను సందర్శించారు. 

ఆ టైంలో ఇసుకను తవ్వి ట్రక్కుల్లో  నింపుతుండగా ఆఫీసర్లు అడ్డుకున్నారు.  సాయంత్రం ఆరు గంటలు దాటినా తవ్వకలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే భారీ ట్రక్కుల్లో  30 టన్నుల నుంచి 32 టన్నుల వరకు ఇసుకను నింపాల్సి ఉండగా.. దాదాపు 37 టన్నుల వరకు ఇసుక ఉన్నట్లు గుర్తించి వాహనాన్ని సీజ్ చేశారు. రూ.50 వేల ఫైన్ వేశారు. క్వారీ వద్ద వెయింగ్ మెషీన్, సీసీ కెమెరాలను అందుబాటులో లేకపోవడంతో ఈ విషయాన్ని రిపోర్టులో పేర్కొన్నారు. 

నిర్వాహకులు ఇసుక తవ్వకాలకు సంబంధించిన రికార్డులు మెయింటెన్  చేయలేదని తేల్చారు. తవ్వకాలు సమయంలో టీజీఎండీసీ సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉండగా.. వారు లేకపోవడంపై ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే క్వారీలో రూల్ ప్రకారం రెండు మీటర్ల లోతులో మాత్రమే ఇసుకను తోడాల్సి ఉండగా.. ఏకంగా ఆరున్నర మీటర్ల లోతు వరకు ఇసుకను తోడినట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఈ రిపోర్టును కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు  అందించగా.. ఇసుక తవ్వకాల అనుమతులను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.