మనీ లాండరింగ్ కేసు: జైలు నుంచి మహారాష్ట్ర మాజీ మంత్రి విడుదల 

మనీ లాండరింగ్ కేసు:  జైలు నుంచి మహారాష్ట్ర మాజీ మంత్రి విడుదల 

మహారాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌ ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. ఆయనకు పార్టీ  ముఖ్య నేతలు, మద్దతుదారులు జైలు బయట ఘన స్వాగతం పలికారు. దేశ్ ముఖ్ సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. ఓపెన్ టాప్ జీప్ లో కార్యకర్తలకు అభివాదం చేస్తూ వర్లీలోని ఇంటికి వెళ్లారు. ఆ జీపులో అనిల్ దేశ్ ముఖ్ తో పాటు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా ఉన్నారు. 

తాను ఏ నేరం చేయకపోయినా జైలులో ఉంచారని అనిల్ దేశ్ ముఖ్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని.. అందుకే జైలు నుంచి విడుదల అయ్యానని తెలిపారు. 72 ఏండ్ల దేశ్‌ముఖ్ దాదాపు గత ఏడాది కాలంగా జైలులో ఉన్నారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంతో.. 2021 నవంబర్ నుంచి ఆయన జైలు జీవితం గడిపారు. దేశ్ ముఖ్ కు డిసెంబర్ 12వ తేదీన బొంబాయి హైకోర్టు  బెయిల్  మంజూరు చేసింది. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సీబీఐ 10 రోజులు గడువు అడగటంతో డిసెంబర్ 27 వరకూ హైకోర్టు తమ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. అనంతరం అత్యున్నత న్యాయస్థానాన్ని సీబీఐ ఆశ్రయించింది. కోర్టుకు సెలవులు కావడంతో 2023 జనవరిలోనే ఈ పిటిషన్ విచారణకు వస్తుంది.

ఈ క్రమంలో తమకు మరికొంత వ్యవధి కావాలని కోర్టును సీబీఐ  కోరింది. దీనిపై దేశ్‌ముఖ్ న్యాయవాదులు అంకిత్ నికమ్, ఇంద్రపాల్ సింగ్ తన వాదన వినిపిస్తూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిలును మరోసారి పొడిగించేది లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. వాదనల అనంతరం కోర్టు తీర్పు వెలువరిస్తూ, తాము బెయిలు మంజూరు చేస్తూ ఇంతకుముందు ఇచ్చిన తీర్పుపై మరోసారి స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో దేశ్‌ముఖ్ విడుదలకు మార్గం సుగమం అయింది.