ముంబై: మహారాష్ట్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మరాఠీ భాషపై ప్రాథమిక అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈమేరకు మోటార్ వెహికిల్స్ యాక్ట్–1988లో మార్పులు చేయనున్నారు.
మోటార్ అమెండ్మెంట్ రూల్స్–2026 అమల్లోకి రానున్నాయి. ఎలక్ట్రానిక్ మీటర్లు ఉన్న ఆటోలు, ట్యాక్సీలు, యాప్ ఆధారిత క్యాబ్ల డ్రైవర్లు, పర్మిట్దారులకు కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. సవరించిన రూల్ 78, రూల్ 85 ప్రకారం పర్మిట్దారులకు మరాఠీపై ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి.
సాధారణ సంభాషణకు అవసరమైన స్థాయిలో మరాఠీ మాట్లాడలేని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు తొలుత నెల రోజుల గడువు ఇస్తారు. ఆ సమయంలో భాష నేర్చుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ను 3 నెలలు, ఆ తర్వాత కూడా మరాఠీ నేర్చుకోకపోతే శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉంటుంది.
ప్రయాణికులతో మాట్లాడడం, వారి సమస్యలు అర్థం చేసుకోవడం, సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు స్థానిక భాషపై ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరమని రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు.
