లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ కుంటుంబం నుంచి మరో వారసురాలు వెండితెరపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆమే.. ప్రిన్స్ మహేశ్ బాబు మేనకొడలు, నటి నిర్మాత మంజుల ఘట్టమనేని సంజయ్ స్వరూప్ దంపతుల గారాల కూతురు జాన్వీ. లేటెస్ట్ గా జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా ఆమె సినీ ఎంట్రీని తల్లి మంజుల సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అభిమానుల్లో కొత్త ఉత్సహం నెలకొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
మంజుల భావోద్వేగ పోస్ట్..
మహేష్ బాబు అక్క ఘట్టమనేని మంజుల తన కుమార్తె ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ భావోద్వేగంతో నిండిన పోస్ట్ చేశారు. 'నా చిన్నారి జాన్వీ ఎంత ఎదిగిపోయిందో.. ఇప్పుడు రంగుల సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తనకు మంచి మనసుతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉంది. అవన్నీ త్వరలోనే సినీ ప్రియులు చూడబోతున్నారు. నీ కోసం వెండితెర ఎదురుచూస్తోంది మై డార్లింగ్.. ఐ లవ్యూ సో మచ్. హ్యాపీ బర్త్డే మై జాను" అని తన ప్రేమను వ్యక్తం చేశారు మంజుల ఘట్టమనేని.
నటనలో తొలి అనుభవం
జాన్వీకి నటనా రంగం కొత్తేమీ కాదు. 2018లోనే తల్లి మంజుల దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది' చిత్రంలో ఆమె ఓ చిన్న పాత్రలో కనిపించింది. పదేళ్ల వయసులోనే కెమెరా ముందు సహజమైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాకు మేనమామ మహేశ్బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. చిన్నప్పటి నుంచి నటన, నృత్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుని తన ప్రతిభను మెరుగుపరుచుకుంది జాన్వీ. ఇప్పుడు పూర్తిస్థాయి కథానాయికగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
సినీ రంగంలో పేరెంట్స్ ..
జాన్వీ పేరెంట్స్ మంజుల , సంజయ్ స్వరూప్ ఇద్దరూ సినీ రంగానికి చెందినవారే. మంజుల నటిగా పలు చిత్రాల్లో మెప్పించడంతో పాటు, 'మనసుకు నచ్చింది' సినిమాకు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా, ఆమె స్థాపించిన ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్పై 'పోకిరి' , 'ఏ మాయ చేశావె' వంటి బ్లాక్బస్టర్ సినిమాలను నిర్మించింది. జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. తండ్రి సంజయ్ స్వరూప్ సైతం 'అర్జున్ రెడ్డి', 'చల్ మోహనరంగ' వంటి పలు చిత్రాల్లో సహాయ నటుడిగా మంచి గుర్తింపు పొందారు.
ప్రస్తుతం జాన్వీ డెబ్యూ చిత్రానికి సంబంధించిన కథ , నిర్మాణ సంస్థ లాక్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఘట్టమనేని కుటుంబం నుంచి మొదటి కథానాయికగా అడుగుపెడుతున్న జాన్వీ స్వరూప్కు సినీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు లభించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
