ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. పీసీసీ చీఫ్ వాంగ్మూలం తీసుకోనున్న పోలీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. పీసీసీ చీఫ్ వాంగ్మూలం తీసుకోనున్న పోలీసులు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులను విచారించిన పోలీసులు.. తాజాగా సాక్షుల విచారణ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‎ను సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని పోలీసులు కోరారు. 2025, జూన్ 17న మహేష్ గౌడ్ పోలీసుల ముందు హాజరై ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్నాడు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు సినీ, రాజకీయ, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, వ్యాపారుల ఫోన్లు ట్యా్ప్ చేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్, ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, కిషన్ రావులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఒక్క ప్రభాకర్ రావును మినహాయించి మిగిలిన నిందిలందరిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రభాకర్ విదేశాలకు పారిపోవడంతో ఆయనను తిరిగి ఇండియాకు తీసుకొచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు కూడా పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.

ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సాక్షుల విచారణను కూడా పోలీసులు షూరు చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‎గా ఉన్న ప్రస్తుత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఆయనను సాక్షిగా విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని పోలీసులు కోరారు. ఓ వైపు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు.. మరోవైపు సాక్షులను విచారిస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.