శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి.. అయ్యప్ప నామస్మరణతో దద్దరిల్లిన శబరిగిరులు

శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి.. అయ్యప్ప నామస్మరణతో దద్దరిల్లిన శబరిగిరులు

తిరువనంతపురం: శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. బుధవారం (జనవరి 14) పొన్నాంబలమేడు పర్వఖ శిఖరాల్లో దేదీప్యమానంగా భక్తులకు మకర జ్యోతి కనువిందు చేసింది. అయ్యప్ప స్వామి ప్రత్యక్ష స్వరూపమని భక్తులు ప్రగాఢంగా భావించే మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప మాలధారులు, భక్తులు పెద్ద ఎత్తున శబరికి తరలివచ్చారు. మకరజ్యోతిని చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తులు చేసిన నామస్మరణతో శబరిగిరులు దద్దరిల్లిపోయాయి. శబరికి వెళ్లలేకపోయిన అయ్యప్ప స్వాములు, భక్తులు మకర జ్యోతిని టీవీల్లో తిలకించి తన్మయత్వంలో పులకించిపోయారు.

మకర జ్యోతి దర్శనం నేపథ్యంలో ట్రావెన్ కోర్ బోర్డు భారీగా ఏర్పాట్లు చేసింది. అయ్యప్ప స్వాములు, భక్తులు  మకర జ్యోతిని స్వయంగా చూసేందుకు శబరికి పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఆలయ అధికారులు, పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఈ సారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా మకర జ్యోతి దర్శనం పూర్తి అయ్యింది.