ఎమ్మెల్సీ మధుపై హెచ్‌‌ఆర్సీకి ..మాల మహానాడు ఫిర్యాదు

ఎమ్మెల్సీ మధుపై హెచ్‌‌ఆర్సీకి ..మాల మహానాడు ఫిర్యాదు

హైదరాబాద్‌‌, వెలుగు: స్పీకర్‌‌ను దూషించిన ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు నేతలు మానవ హక్కుల కమిషన్‌‌ (హెచ్‌‌ఆర్సీ), ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌కు ఫిర్యాదు చేశారు. ఎర్రవల్లి ఫామ్‌‌హౌస్‌‌ వద్ద దళితుల పట్ల అవమానకరంగా వ్యవహరించిన బీఆర్‌‌ఎస్‌‌ నాయకురాలు పావని గౌడ్‌‌పైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌‌, ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్​గురువారం బషీర్‌‌బాగ్‌‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌ చైర్మన్‌‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్‌‌లోనూ ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌‌ను దారుణంగా దూషించారని ఆరోపించారు. ఎర్రవల్లి ఫామ్‌‌హౌస్‌‌ వద్ద దళితులు నిరసన తెలిపిన తర్వాత అక్కడ పసుపు నీళ్లు, పాలు చల్లి శుద్ధి చేయడం దళితులను అవమానించడమేనన్నారు. దళితులను కించపరిచేలా మాట్లాడిన వారిపై, వారికి అండగా ఉన్న నాయకత్వంపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.