
- మాల మహానాడు జాతీయఅధ్యక్షుడు చెన్నయ్య
- అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన చేపట్టాలని పిలుపు
జూబ్లీహిల్స్, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాలలపై వివక్ష చూపుతున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామనడం కరెక్ట్ కాదన్నారు. బుధవారం బంజారాహిల్స్లోని మాల మహానాడు ఆఫీసులో చెన్నయ్య మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ గతంలో చంద్రబాబు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు.
ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్నారు. చంద్రబాబు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, మాలలంతా కలిసి ఏపీలోని అన్ని జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన చేపట్టాలని చెన్నయ్య పిలుపునిచ్చారు. సమావేశంలో మాల మహానాడు జాతీయ నాయకుడు గోపూజు రమేశ్, మాల మహానాడు గ్రేటర్ అధ్యక్షుడు బైండ్ల శ్రీనివాస్, మాల మహానాడు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బంగి ఆనంద్ కుమార్, మాల మహానాడు గ్రేటర్ వైస్ ప్రెసిడెంట్ గోకుల్ కల్యాణ్, జెట్టి గిరి, భాను, ఓబులేశ్, ఎల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.